ఎన్నికలు దగ్గరపడుతున్నాయనే...
తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ పర్యటనను కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. టీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మకు మొక్కు చెల్లించడానికి వెళ్లలేదని ఆరోపించారు. ఈ నెపంతో విజయవాడలోని కమ్మ సామాజిక వర్గాన్ని కలవడానికి వెళ్లారని రేవంత్ రెడ్డి తెలిపారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో కేసీఆర్ కమ్మ సామాజిక వర్గాన్ని ప్రసన్నం చేసుకోడానికి ఈ పర్యటన చేపట్టారని రేవంత్ తెలిపారు. హైదరాబాద్ లో ఈ సామాజిక వర్గానికి చెందిన వారు చాలామంది ఉండటంతో వారి ఓట్ల కోసమే కేసీఆర్ పర్యటన సాగిందని అన్నారు. నాలుగేళ్లుగా గుర్తుకురాని మొక్కు ఎన్నికలు సమీపిస్తున సమయంలో ఎందుకు గుర్తుకొచ్చినట్లని రేవంత్ ప్రశ్నించారు.
తాను పక్కా తెలంగాణ వాదినని చెప్పుకునే కేసీఆర్ మొక్కు చెల్లించడానికి విజయవాడ వెళ్లడం ఏంటని రేవంత్ ప్రశ్నించారు. ముక్కుపుడక సర్పించుకోవాలనుకుని మొక్కుకోవాలంటే హైదరాబాద్ జూబ్లీహిల్స్లో పెద్దమ్మ తల్లి, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి తో పాటు ప్రతి ఊరూరా పోచమ్మ తల్లులు ఉన్నారని అన్నారు. ఇక్కడ కాకుండా విజయవాడకు వెళ్లడానికి కమ్మ వారే కారణమని రేవంత్ రెడ్డి తెలిపారు.