
తెలంగాణ సమాజం మొత్త మునుగోడు వైపు చూస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో ముందుకు వెళ్తుంది. టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నేడు మునుగోడు నియోజకవర్గంలో శనివారం పర్యటించారు. నారాయణపూర్ మండలం పొర్లగడ్డ తండాలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడించిందన్నారు. తెలంగాణ వస్తేనే ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని భావించామని చెప్పారు. కానీ 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపలేదని విమర్శించారు. కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం దురదృష్టకరం అంటూ సంచలన కామెంట్స్ చేశారు. వారు ఇన్నాళ్లూ చేసిన పోరాటాలు వృథా అయిపోతాయని అన్నారు.
రాజీనామాల ద్వారానే నిధులు వస్తాయని బీజేపీ చెబుతందని.. అలాంటప్పుడు బీజేపీలోని నలుగురు ఎంపీలను రాజీనామా చేయించి నిధులు తీసుకురావాలని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో ఏ గ్రామాలకు నిధులు వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను కూడా బీజేపీలో చేర్చుకున్నారని.. మరి వారిచేత ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. అలా చేస్తే ఆయా గ్రామాలకు కూడా నిధులు వస్తాయి కదా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
అమ్ముడుపోయినవాళ్లంతా సిద్దాంతాలు చెప్పడం దారుణమని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ తోడు దొంగలుగా మారి ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. రెండు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే మునుగోడులో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. డిండి ప్రాజెక్టు పూర్తిచేయకపోవడం వల్ల మునుగోడుకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే మునుగోడు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.