మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

Published : Aug 28, 2018, 10:22 AM ISTUpdated : Sep 09, 2018, 12:12 PM IST
మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

సారాంశం

 భారత ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని మహారాష్ట్రలోని పూణే పోలీసులు నిర్ధారించారు

హైదరాబాద్:   ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని మహారాష్ట్రలోని పూణే పోలీసులు నిర్ధారించారు. మావోయిస్టుల కుట్రలో విరసం నేత వరవరరావు పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు వరవరరావుపై పూణే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా పూణే పోలీసులు మంగళవారం నాడు వరవరరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. వరవరరావుతో పాటు మరో ముగ్గురి ఇళ్లలో కూడ సోదాలు నిర్వహిస్తున్నారు.

అందులో భాగంగా  హైద్రాబాద్ గాంధీనగర్ లో విరసం నేత వరవరరావు నివాసంలో ఉదయం నుంచి పూణే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. వరవరరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయించడంతోపాటు ఇంటి లోపల నుంచే తాళం వేశారు. 

వరవరరావు నివాసంతోపాటు ఆయన కుమార్తె..నాగోలులో ఉంటున్నఓ జర్నలిస్టు నివాసంతోపాటు ,ఇఫ్లూలో పనిచేస్తున్న ప్రోఫెసర్ సత్యనారాయణ  ఇంట్లో కూడ పోలీసులు సోదాలు నిర్వహించారు. మెత్తం నాలుగు చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపారు.. ప్రధాని హత్యకు మావోయిస్టుల కుట్రలో వరవరరావు నిధులు సమకూరుస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు

ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు పన్నిన కుట్రకు సంబంధించిన లేఖలో ప్రముఖ విప్లవ కవి వరవరరావు పేరు ప్రస్తావనకు వచ్చింది. పూణే పోలీసులకు చిక్కిన ఐదుగురు మావోయిస్టుల్లో జాకబ్ విల్సన్ రాసిన లేఖలో వరవరరావు పేరున్నట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ మేరకు ఈ ఏడాది జూన్ 8వ తేదీన పోలీసులు ఈ లేఖను స్వాధీనం చేసుకొన్నారు. రోనా జాకబ్ విల్సన్ ను పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేసిన సందర్భంగా ఈ లేఖ విషయం వెలుగు చూసింది.


నక్సలైట్ సానూభూతి పరులతోనూ, కవి వరవరరావుతోనూ మాట్లాడినట్లు కామ్రేడ్ ఎం పేరు మీద రాసి లేఖలో ఉంది. ఆ విధమైన దాడులు చేయడానికి వరవరరావు, సురేంద్ర గాడ్లింగ్  మార్గదర్శనం చేస్తారని ఆ లేఖలో ఉంది. పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో సురేంద్ర గాడ్లింగ్ ఉన్నారు లేఖలో ప్రస్తావనకు రావడంతో పూణే పోలీసులు వరవరరావు ఇంట్లో మంగళవారం నాడు సోదాలు నిర్వహిస్తున్నారు.

విల్సన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న లేఖలో ఎం4 రైఫిల్ ను, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేయడానికి 8 కోట్ల రూపాయలు అవసరమవుతాయని రాసి ఉందని ఆ లేఖలో పోలీసులు చెబుతున్నారు.

అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే  వరవరరావు ఖండించారు. కావాలనే తనను టార్గెట్ చేస్తున్నారని వరవరరావు అన్నారు. ఇలాంటి ఆరోపణలు వచ్చినంత మాత్రాన విల్సన్ తో తనకు సంబంధం లేదని చెప్పలేనని వరవరరావు అన్నారు.

రాజకీయ ఖైదీల విడుదల కోసం పోరాటం చేస్తున్నవారిని టార్గెట్ చేయడానికే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. తనను, విల్సన్ ను అరెస్టు చేయడానికే ఈ కుట్ర అని ఆయన అన్నారు. ప్రధాని మోడీపై దాడి చేసేంత శక్తి మావోయిస్టులకు ఉందా అనేది అనుమానమని ఆయన అన్నారు. 

ఈ కేసు విషయమై  వరవరరావుతో పాటు  ఇఫ్లూ ప్రోఫెసర్ సత్యనారాయణ , వరవరరావు కూతురు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాల కోసం మహారాష్ట్ర,ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ పోలీసులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

ఈ వార్త చదవండి

మోడీ హత్యకు మావోల కుట్ర: లేఖలో వరవరరావు పేరు

 

PREV
click me!

Recommended Stories

Drunk & Drive Test in Ramagundam: పోలీసులకు చుక్కలు చూపించిన మందుబాబులు| Asianet News Telugu
Hyderabad : జీరో మైలురాయి ఎక్కడుంది.. హైదరాబాద్ దూరాన్ని ఎక్కడినుండి కొలుస్తారో తెలుసా..?