సీసీటీవీ ఫుటేజ్ అడిగినందుకు హైదరాబాద్ బేగంపేట్లోని హైఫై పబ్ యాజమాన్యం దారుణంగా ప్రవర్తించింది. పార్కింగ్ ఏరియాకి పిలిచి యువతి, ఆమె బంధువులపై దాడికి పాల్పడింది.
హైదరాబాద్ బేగంపేట్లోని హైఫై పబ్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగింది. కస్టమర్లపై విచక్షణారహితంగా దాడికి పాల్పడింది. పబ్లో ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించాడో యువకుడు. అదంతా సీసీటీవీ కెమెరా రికార్డుల్లో నమోదైంది. పోలీసులకు ఫిర్యాదు చేయడం కోసం సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని పబ్ యాజమాన్యాన్ని కోరారు బాధితురాలు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమ పబ్ పేరు పాడైపోతుందని వాదించాడు మేనేజర్ మురళీకృష్ణ.
అయినప్పటికీ సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సిందేనని బాధితురాలు వాదించింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పబ్ యాజమాన్యం.. పార్కింగ్ ఏరియాకి పిలిచి బాధితురాలు, ఆమె బంధువులపై దాడికి పాల్పడ్డారు. బాధితులను బేగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న పబ్ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.