కరోనాతో మరణించిన జర్నలిస్టులు వీరే: ప్రభుత్వాల వివక్ష, ప్రెస్ క్లబ్ వినతి

By telugu teamFirst Published Apr 24, 2021, 6:13 PM IST
Highlights

కరోనా వైరస్ బారిన పడి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 13 మంది జర్నలిస్టులు మరణించారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో వార్తలు సేకరిస్తూ వారు కరోనా బారిన పడ్డారు. 

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ బారిన పడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 13 మంది మరణించినట్లు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎస్ విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బి. రాజమౌళి తెలిపారు. కరోనా విషయంలో జర్నలిస్టులను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వారు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఓ వినతి పత్రం సమర్పించారు. 

విధులు నిర్వహిస్తూ జర్నలిస్టులు కోవిడ్ బారిన మరణిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వారన్నారు. గత ఇరవై రోజుల్లో దాదాపు పదిహేను మంది జర్లిస్టులు వ్యాధి బారిన పడి మరణించినట్లు వారు తెలిపారు. వ్యాధితో పలువురు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ, చికిత్స సరైన సమయంలో అందకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని వారన్నారు. 

ఆ విషయంలో హైదరాబాద్ సహా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టులకు ప్రత్యే క్యూ ఏర్పాటు చేయించడం, ఆస్పత్రుల్లో అవసరమైన పడకలను కేటాయించాల్సిన అవసరం ఉందని వారన్నారు. అదే సమయంలో జర్నలిస్టులను ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించకపోవడం వల్ల అనేక మంది టీకా డోసులు తీసుకోలేకపోయారని వారు చెప్పారు. టీకా విషయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆదుకోవాలని వారు కోరారు.

కరోనాతో మరణించిన జర్నలిస్టులు

1. కె అమర్నాథ్, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్, తెలంగాణ
2. జయప్రకాశ్, కరీంనగర్ జిల్లా, తెలంగాణ
3. శ్రీనివాస్, రిపోర్టర్, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ
4. సాయినాథ్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
5. డి. అశోక్, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ
6. బుర్రా రమేష్, సిరిసిల్ల జిల్లా, తెలంగాణ
7. పి. రమేష్, కరీంనగర్, తెలంగాణ
8. సిహెచ్ నాగరాజు, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ
9. రామచంద్ర రావు, హైదరాబాద్, తెలంగాణ
10. కల్పన, హైరదాబాద్, తెలంగాణ
11. పి. తాతయ్య, ఒంగోలు, ఆంధ్రప్రదేశ్
12. చంద్రశేఖర నాయుడు, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
13. శ్రీనివాస రావు, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్

వారి ఫోటోలను జత చేస్తూ జర్నలిస్టుల మరణాలపై పలువురు జర్నలిస్టులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు, స్పందిస్తున్నారు. 

click me!