
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు పెంచారు. తాజాగా, రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని ఎండగట్టారు. అలాగే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ను టార్గెట్ చేసుకుని పరోక్షంగా విమర్శలు సంధించారు. కొందరు అధికార మదంతో విర్రవీగుతున్నారని, ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. భూ కబ్జాలు, ప్రజలపై దౌర్జన్యాలు పతాక స్థాయికి చేరుకున్నాయని అన్నారు. ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మంలో కష్టపడి సంపాదించుకున్న దాన్ని కూడా అనుభవించలేని దుస్థితికి ప్రజలు నెట్టివేయబడ్డారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ ఓ 200 గజాల స్థలం కొంటే ఐదేళ్ల తర్వాత ఆ భూమి వారి చేతిలో ఉండలేని పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. అధికారం ఉందని కొందరి ఇంటి స్థలాలనూ కబ్జ చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: పార్టీ మార్పుపై ఈటల స్పష్టీకరణ.. ‘సొంత పార్టీ నేతలే నేను బయటికి పోవాలని కోరుకుంటున్నారు’
కష్టపడి సంపాదించుకున్న మెతుకులనూ నోటిలోకి పోనివ్వకుండా చేస్తున్న దౌర్భాగ్య రాజకీయాలు ఇక్కడ ఉన్నాయని పొంగులేటి మండిపడ్డారు. వ్యాపారాలు, కాంట్రాక్టులు కూడా అన్నీ వాళ్లకే కావాలంటా.. అంటూ అధికార పార్టీ నేతలపై ఫైర్ అయ్యారు. అయితే.. వారి ఆగడాలు ఈ ఎన్నికల వరకే సాగుతాయని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయ ఢంకా మోగిస్తుందని వివరించారు. కాబట్టి, ఒక రెండు నెలలు ఓపిక పట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు నెలలు వారు ఇబ్బందులకు గురి చేస్తారని, వాటిని తట్టుకోవాలని అన్నారు. ఆ తర్వాత వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అందరి ప్రయోజనాలు నెరవేరుతాయని తెలిపారు.