ధనవంతుడి అక్రమ సంబంధం.. రక్షిస్తామని.. రూ.4 కోట్లు వసూలు చేసిన పోలీసులు

By sivanagaprasad KodatiFirst Published Sep 6, 2018, 9:25 AM IST
Highlights

ప్రజలను రక్షించి న్యాయం చేయాల్సిన రక్షకభటులు... భక్షక భటులుగా మారుతున్నారు. వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే వారిని తాము సెటిల్‌మెంట్ చేస్తామని కోట్లకు కోట్లు దండుకుంటున్నారు

ప్రజలను రక్షించి న్యాయం చేయాల్సిన రక్షకభటులు... భక్షక భటులుగా మారుతున్నారు. వివిధ కేసులపై స్టేషన్‌కు వచ్చే వారిని తాము సెటిల్‌మెంట్ చేస్తామని కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన డబ్బున్న పెద్ద మనిషి ఓ మహిళతో పెట్టుకున్న అక్రమ సంబంధం నుంచి రక్షిస్తామంటూ రూ. 5 కోట్లు వసూలు చేసి.. దానిలో రూ.4 కోట్లు స్వాహా చేశారు.

వివరాల్లోకి వెళితే... జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న 40 ఏళ్ల మహిళకు.. ఒక కనస్ట్రక్షన్ కంపెనీ ఎండీతో పరిచయం ఏర్పడి.. అక్రమ సంబంధానికి దారి తీసింది. ఆమెను పెళ్లిచేసుకుంటానని నమ్మిస్తూ ఎండీ తన బంధాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొద్దిరోజులు బాగానే నడిచినప్పటికీ.. తర్వాత ఇద్దరి మధ్యా విభేదాలు వచ్చి.. సదరు మహిళ పశ్చిమ మండలం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టకుండా కాలం వెళ్లదీశారు. తనకు న్యాయం చేయడం లేదంటూ బాధితురాలు మరోసారి పోలీసులను నిలదీయడంతో.. వారు నిర్మాణ సంస్థ ఎండీని స్టేషన్‌కు పిలిపించారు. మీతో రిలేషన్‌లో ఉన్న మహిళ ఫిర్యాదు చేసిందని...మీడియాకు విషయం చేరకుండా ఇప్పటి వరకు కాపాడామని..కానీ ఇకపై అరెస్ట్ చేయక తప్పదని బెదిరించారు.

పరువు పోతుందని గ్రహించిన ఎండీ కేసును సెటిల్ చేయాలని పోలీసులను కోరడంతో..రూ.5 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు ఒప్పుకున్న ఎండీ అప్పటికప్పుడే రూ.5 కోట్లు ఇచ్చాడు. అనంతరం మీరు కోరినట్లు కోటి ఇస్తారు.. కేసు వెనక్కు తీసుకోమన్నారు. బాధితురాలికి రూ.50 లక్షలు, విలేకరికి రూ.50 లక్షలు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం తనకు ఇంకా రూ.50 లక్షలు రావాలంటూ బాధితురాలు ఎండీని నిలదీసింది. తాను రూ.5 కోట్లు ఇచ్చానని చెప్పాడు..

దీనిపై ఆగ్రహించిన మహిళ పోలీసులు తనను మోసగించారని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు తన వాటాగా వచ్చిన రూ.50 లక్షలలో సదరు విలేకరి విలాసవంతమైన భవంతి కొనడంతో పాటు స్నేహితులతో గోవా ట్రిప్‌కు వెళ్లినట్లుగా సమాచారం. విషయం బయటకు పొక్కితే పోలీస్ శాఖ పరువు పోతుందని గ్రహించిన ఉన్నతాధికారులు.. అంతర్గతంగా కేసును విచారిస్తున్నారు. 

click me!