వరంగల్ పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ ఫ్లెక్సీకి ప్రజలు పాలాభిషేం చేశారు. ఆక్రమణదారుల నుంచి తమ భూములను కాపాడినందుకు కృతజ్ఞతగా వారు ఇలా చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
శ్రీరామనవవి పర్వదినం సందర్భంగా వరంగల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నగర పోలీస్ కమీషనర్ ఏవీ రంగనాథ్ చిత్రపటానికి ప్రజలు పాలాభిషేకం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఏనుమాముల మార్కెట్ యార్డ్ సమీపంలో పేదలకు చెందిన స్థలాలను కొందరు ఆక్రమించుకున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే భౌతికదాడులకు దిగడంతో నిరుపేదలు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ను ఆశ్రయించారు. దీంతో ఆయన సీరియస్ అయ్యారు. వెంటనే ఆక్రమణదారుల అంతు చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
పోలీసుల విచారణలో ఇది నిజమేనని తేలడం, ఆక్రమణదారులు గతంలోనూ ఇదే తరహాలో వ్యవహరించినట్లుగా తెలిసింది. దీంతో వారి ఆగడాలకు చెక్ పెట్టిన సీపీ , గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దీంతో నిరుపేదలు సంబరాలు జరుపుకున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తాము ఎంతో కష్టపడి సంపాదించిన భూములను ఆక్రమణదారుల నుంచి విడిపించిన సీపీకి ధన్యవాదాలు తెలియజేశారు. అంతేకాకుండా శ్రీరామనవమి సందర్భంగా రంగనాథ్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి కృతజ్ఞత చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.