ఈ నెల 24వ తేదీన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని సిద్దం చేసుకన్నారు. ఈ ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని నామకరం చేశారు. ఈవాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.
అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. ధర్మపురి నరసింహస్వామి ఆలయంలో ఈ యాత్రకు పేరు పెట్టనున్నారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2009లో ఎన్నికల ప్రచార సమయంలో పవన్ కళ్యాణ్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నారు. హైటెన్షన్ విద్యుత్ వైర్లు పవన్ కళ్యాణ్ తగిలాయి. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి కృపతోనే తాను ప్రాణాపాయం నుండి తప్పించుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ భావిస్తారు. తాను ఏ కార్యక్రమం చేపట్టినా కూడా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుండి ప్రారంభించడం ఆనవాయితీగా పెట్టుకున్నారు.
2022 డిసెంబర్ 12వ తేదీన వారాహి వాహనానికి తెలంగాణ రవాణాశాఖాధికారులు రిజిస్ట్రేషన్ చేశారు. ఈ వాహనానికి టీఎస్ 13ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయించారు. వారాహి వాహనం ఆర్మీ ఉపయోగించే రంగుతో ఉన్నందున ఈ వాహనానికి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని చెప్పారు . అయితే ఈ వాహనం రంగు ఆర్మీ ఉపయోగించే రంగు కాదని తెలంగాణ రవాణాశాఖ అధికారులు ప్రకటించారు.
also read:పవన్ కళ్యాణ్ వారాహి వాహనం తెలంగాణలో రిజిస్ట్రేషన్:టీఎస్ 13 ఈఎక్స్ 8384 నెంబర్ కేటాయింపు
2022 అక్టోబర్ మాసంలోనే ఏపీ రాష్ట్రంలో బస్సు యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ తొలుత నిర్ణయం తీసుకున్నారు. జనవాణి కార్యక్రమం పూర్తికానందున బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టుగా 2022 సెప్టెంబర్ 18న పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాత్ర నిర్వహించనున్నారు. వారాహి వాహనంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు.