రూ.35 కిలో ఉల్లి... ఎక్కడ, ఎలా పొందాలంటే..: మంత్రి నిరంజన్ రెడ్డి

By Arun Kumar PFirst Published Oct 24, 2020, 2:18 PM IST
Highlights

పైపైకి వెళుతున్న ఉల్లి ధరను నియంత్రణ చర్యల్లో భాగంగా  రాయితీపై ఉల్లిని ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. 

హైదరాబాద్: మరోసారి దేశవ్యాప్తంగా ఉల్లి ధర భారీగా పెరిగింది. ఇటీవల దేశవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు ఉల్లిపంటను నాశనం చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో సామాన్యుడికి ఉల్లి ఘాటు తగలకముందే కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా కదిలింది. 

పైపైకి వెళుతున్న ఉల్లి ధరను నియంత్రణ చర్యల్లో భాగంగా వ్యాపారుల నిల్వ పరిమితిపై కేంద్రం ఆంక్షలు విధించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా రాయితీపై ఉల్లిని ప్రజలకు అందించే ఏర్పాట్లు చేస్తోంది. ముందుగా రాజధాని హైదరాబాద్ లోని రైతు బజార్లలో రూ.35కే కిలో ఉల్లిగడ్డలను అందించనున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. 

ఉల్లిగడ్డలు కావాల్సిన వారు ఏదయినా గుర్తింపుకార్డును తీసుకువెళ్ళి దగ్గర్లోని రైతుబజార్లలో సబ్సిడీ ధరకు తీసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. ఉల్లి ధర తగ్గేవరకు ఇలా మార్కెట్ కంటే తక్కువ ధరకే ప్రజలకు ఉల్లిని అందిస్తామన్నారు. అంతేకాకుండా ఉల్లి ధర నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. వ్యాపారులు కూడా అధిక లాభాలను ఆశించకుండా ఉల్లిని విక్రయించాలని మంత్రి  కోరారు. 
 

click me!