
తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షల నిర్వహణ తీరు బాగా విమర్శలకు దారితీసిన సంగతి తెలిసిందే.
ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షా కేంద్రాల కేటాయింపు చాలా అస్తవ్యస్తంగా జరిగింది.ఫలితంగా ఎక్కడో కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో పరీక్షా కేంద్రాలు వచ్చిన విద్యార్థులు చాలా మంది పరీక్షకు గైరు హాజరయ్యారు. ఇపుడు మరొక విచిత్ర మయిన నిబంధన వల్ల పరీక్షరాయలేక పోయిన అభ్యర్థి ఉదంతం వెలుగులోకి వచ్చింది.
గోరింటాకు, నైల్ పాలిష్, గొలుసులు లేకుండా పరీక్షకు హాజరవ్వాలని టిఎస్ పిఎస్ సి ఒక నిబంధన పెట్టింది. నిన్న జరిగిన గ్రూపు-2 పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష హాల్లోకి వెళ్లేముందు తమ ఒంటిపై ఉన్న రింగ్, చైన్లు, నగదు, మెట్టెలు, గాజులతో పాటు మంగళసూత్రాలను కూడా తీసేసి వెళ్లాలనే నిబంధనను అధికారులు తు.చ.తప్పకుండ అమలుచేశారు.
దీనితో చాలా మంది వివాహిత మహిళా అభ్యర్థులు ఖంగు తిన్నారు,. చాలా చోట్ల వారికి తోడుగా వచ్చిన భర్తలు సిబ్బందితో కోట్లాటకు దిగినట్లు వార్తలు వస్తున్నాయి.. హైదరాబాద్లోని భోలక్పూర్ లో ఈ వివాదం అభ్యర్థి పరీక్ష రాయకుండా వేనుదిరిగి వెళ్లేదాకా వచ్చింది. అక్కడి అంజుమన్ సొసైటీ పరీక్షా కేంద్రం వద్ద పరీక్ష రాసేందుకు వచ్చిన ఒక అభ్యర్థినిని అపేసి, మంగళసూత్రం తీస్తే తప్ప హాల్లోకి అనుమతించేది లేదని అధికారులు నిలదీశారు.
కొత్త గా వివాహమయిన ఆమె దీనికి ససేమిరా అంది. అసలే శుక్రవారం అని, తాను మంగళసూత్రం తీయడం సాధ్యం కాదని దీనంగా బతిమాలుకుంది. రూలు రూలే, తీసేందుకు సిద్ధమయితే పరీక్ష, లేకుంటే, మంగళ సూత్రమే ఉంచుకో అని వారు అనడంతో, పరీక్ష రాయకుండా ఇంటికి వెళ్లిపోయింది. ఇది ఎలాంటి నియమమో , ఇందులో ఉన్న లాజిక్కేమిటో అర్థం కాక అభ్యర్థులు తలబాదుకుంటున్నారు.