నిజాం ఆస్తుల కేసులో పాకిస్తాన్ కు మరో షాక్ తగిలింది. ఈ కేసులో 65 శాతం కోర్టు ఖర్చులను చెల్లించాలని పాకిస్తాన్ కు లండన్ కోర్టు తేల్చి చెప్పింది.
లండన్: నిజాం ఆస్తుల కేసులో కోర్టు ఖర్చుల్లో కనీసం 65 శాతం ప్రతివాదులకు చెల్లించాలని లండన్ కోర్టు పాకిస్తాన్ ను ఆదేశించింది.ఈ తీర్పు పాకిస్తాన్ కు దిమ్మతిరిగింది.
ఏళ్లుగా హైద్రాబాద్ నిజాంకు చెందిన 3.5 కోట్ల పౌండ్ల నిధుల కేసులో ప్రతివాదులకు పాకిస్తాన్ నిధులను చెల్లించాలని లండన్ కోర్టు తీర్సు ఇచ్చింది. ఇప్పటికే ఈ నిధులన్నీ నిజాం వారసులకే చెందుతాయని కూడ కోర్టు ఇదివరకే తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
ఈ నిధుల విషయమై పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు భారత ప్రభుత్వం నిజాం వారసులు లండన్ కోర్టులో న్యాయం కోసం పోరాటం చేశారు. అయితే ఇటీవలనే ఈ నిధులన్నీ భారత్ కు చెందిన నిజాం వారసులకే చెందుతాయని కోర్టు తీర్పు చెప్పింది.
ఈ తీర్పులో భాగంగా ఈ కేసులో కోర్టు ఖర్చుల్లో 65 శాతం నిధులను పాకిస్తాన్ భరించాలని కూడ కోర్టు సూచించింది.ఈ మేరకు ఈ నెల 19వ తేదీన జడ్జి మార్కస్ స్మిత్ తీర్పు ఇచ్చారు.
నిజాంకు చెందిన 3.5 కోట్ల పౌండ్ల నిధులు భారత ప్రభుత్వం, నిజాం వారసులు ముఖ్రంఝా, ముఫఖం ఝాలకు చెందుతాయని ఈ ఏడాది అక్టోబర్ మాసంలోహైకోర్ట్ ఆఫ్ ఇంగ్లండ్ అండ్ వేల్స్ తీర్పు చెప్పింది.
ఈ వివాదానికి సంబంధించిన ఎంత మేరకు ఖర్చులు చెల్లించాలనే దానిపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాకపోతే ప్రతివాదులకు 65 శాతం కనీసం ఖర్చుల కింద చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో భారత ప్రభుత్వానికి 28 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఫఖం ఝాకు సుమారు 18 లక్షల పౌండ్లు, ప్రిన్స్ ముఖరం ఝాకు సుమారు 8 లక్షల పౌండ్లు దక్కుతాయి.
1948లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 10 లక్షల పౌండ్లను బ్రిటన్లోని పాకిస్తాన్ హైకమిషనర్ హబీబ్ ఇబ్రహీంకు పంపారు. హైద్రాబాద్లోని తన ఖాతా నుండి లండన్ లోని నాట్ వెస్ట్ బ్యాంకులోని హబీబ్ ఖాతాకు ఈ మొత్తాన్ని బదిలీ చేశారు.
ఆయుధాల కొనుగోలు కోసం ఈ నిధులను తన ఖాతాకు బదిలీ చేశారని పాకిస్తాన్ వాదించింది. కానీ, ఈ నిధులు తమవేనని భారత్, నిజాం వారసులు కోర్టును ఆశ్రయించాయి.