ఖమ్మంలో ఎన్ఐఏ సోదాల కలకలం: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేత అరెస్ట్

By Siva KodatiFirst Published Jun 15, 2020, 3:29 PM IST
Highlights

ఖమ్మం నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

ఖమ్మం నగరంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టించాయి. వివరాల్లోకి వెళితే.. తెలంగాణ ప్రజా ఫ్రంట్ అగ్రనేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమాసు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.

తీవ్ర అనారోగ్యంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రెండు రోజులుగా చికిత్స పొందుతున్న కృష్ణను.. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన ఎన్ఐఏ పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు.

మావోయిస్టు పార్టీ సానుభూతిపరుడైన ఆయనను రహస్యంగా విచారించినట్లు తెలుస్తోంది. వారం రోజుల క్రితమే కృష్ణ జైలు నుంచి విడుదలయ్యారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు ఖమ్మం రావడం నగరంలో పెద్ద చర్చకు దారి తీసింది.

స్థానిక పోలీసులకు ఎలాంటి సమాచారం లేకుండా కృష్ణను అదుపులోకి తీసుకుని విచారించడంతో పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోని కోమరారం గ్రామానికి చెందిన నల్లమాసు కృష్ణ.. 2004లో మావోయిస్టులకు ప్రభుత్వానికి జరగిన చర్చల్లో కీలకపాత్ర పోషించారు.

ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంగా తెలంగాణ ప్రజా ఫ్రంట్ కార్యకలాపాలు నిర్వర్తిస్తున్న కృష్ణ కోసం ఎన్ఐఏ బృందం కోమరారం వచ్చి అతని సోదరుడి ఇంట్లో తనిఖీలు నిర్వహించింది.

దీనికి తోడు ఇటీవల తెలంగాణ విద్యావంతుల వేదికకు చెందిన ఒక అగ్రనేతను అదుపులోకి తీసుకోగా అతను కృష్ణ గురించి కీలక సమాచారం తెలియజేసినట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కృష్ణను అదుపులోకి తీసుకుంది.

అయితే తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆయనను హైదరాబాద్‌కు తరలించేందుకు పరిస్ధితులు అనుకూలించకపోవడంతో కృష్ణను ఎన్ఐఏ అధికారులు స్థానిక పోలీసులకే అప్పగించినట్లుగా తెలుస్తోంది. 
 

click me!