కలిసి చనిపోదాం : పెళ్లైన వారానికే.. భార్యతో బలవంతంగా పురుగులమందు తాగించిన భర్త.. !

By AN TeluguFirst Published Jun 22, 2021, 11:16 AM IST
Highlights

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లైన పది రోజులకే ఓ భర్త, భార్యతో పురుగుల మందు తాగించాడు. తానూ తాగాడు. ఈ ఘటన ఇరుకుటుంబాలతో పాటు స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. 

నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెళ్లైన పది రోజులకే ఓ భర్త, భార్యతో పురుగుల మందు తాగించాడు. తానూ తాగాడు. ఈ ఘటన ఇరుకుటుంబాలతో పాటు స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెడితే.. 

మనం కలిసి జీవించడం సాధ్యం కాదు.. కనీసం కలిసి చనిపోదాం..  అంటూ పెళ్లై పది రోజులు కూడా కాకముందే ఓ భర్త తను పురుగులమందు తాగి, భార్యతో కూడా తాగించాడు. వేల్పూరు మండలం పచ్చలనడ్కుడ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. మరో యువతితో సంబంధం ఉండడం వల్లే తనతో కలిసి ఉండలేనని ఇలా చేశాడంటూ భార్య తెలపడం ట్విస్ట్. 

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పచ్చలనడ్కుడ గ్రామానికి చెందిన గంధం గంగాధర్, మల్లక్క దంపతుల రెండో కొడుకు భీమయ్యకు, మాక్లూర్ మండలం మానిక్ బండార్ గ్రామానికి చెందిన కొండపల్లి స్వాతితో ఈ నెల 13న వివాహం జరిగింది. ఆదివారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. 

అయితే అర్థరాత్రి 12 గంటల సమయంలో.. భీమయ్య, భార్య స్వాతితో మనం కలిసి బతకలేం.. అందుకే కలిసి చనిపోదాం.. అంటూ తను పురుగులమందు తాగి, భార్యతో కూడా బలవంతంగా తాగించాడు. వెంటనే బైటికి వచ్చిన స్వాతి పురుగుల మందు తాగిన విషయం అత్తామామలకు చెప్పింది. దీంతో అదే రాత్రి హుటాహుటిన ఇద్దరనీ ఆర్మూర్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరించారు. 

ఈ విషయం తెలిసిన స్వాతి తరఫు బంధువులు సోమవారం ఉదయం ఆర్మూర్ లోని ఆస్పత్రికి చేరుకున్నారు. భీమయ్య కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. మా కూతుర్ని చంపేస్తారా? అంటూ నిలదీశారు. 

ఈ గొడవచూసి సదరు ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు వారికి తాము వైద్యం చేయలేమని, భీమయ్య, స్వాతిలను తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. దీంతో దంపతులను నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ చికిత్స నడుస్తుంది. 24 గంటలు గడిస్తే తప్ప వారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పలేమని వైద్యులు తెలిపారు. 

అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వేల్పూరు ఎస్సై రాజభరత్ రెడ్డి తెలిపారు. అయితే, భీమయ్యకు మరో యువతితో సంబంధం ఉందని, అందుకే మనం కలిసి ఉండలేమని.. తనతో పురుగుల మందు తాగించాడని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న స్వాతి పోలీసులకు తెలిపింది. 
 

click me!