ముత్తిరెడ్డి, దేవసేన వివాదంలో బాహుబలి డైలాగ్స్ పేలుతున్నాయి. నెటిజన్లు బాహుబలి సినిమాల్లోని పాపులర్ డైలాగులను వాడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
జనగామ ఎమ్మెల్యే అక్రమాలను కలెక్టర్ దేవసేన బయటపెట్టారు. ఆయన ప్రజాధనం లూటీ చేసిన విషయాలను, చెరువు భూములను, దేవాలయాల భూములను ఎలా కబ్జా చేశారో వెల్లడించారు. ఆమె మాట్లాడిన 7 నిమిషాల వీడియో ఒకటి జనాల్లోకి చేరిపోయింది. దీనిపై సర్వత్రా ముత్తిరెడ్డి తీరును జనాలు ఎండగడుతున్నారు.
ఈనేపథ్యంలో ముత్తిరెడ్డి కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. సిఎస్, స్పీకర్లకు ఫిర్యాదు చేశారు. సిఎంకు కూడా ఫిర్యాదు చేసి ఆమెను బదిలీ చేయించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరమైతే న్యాయ పోరాటానికి దిగుతానని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బాహుబలి సినిమాలో ఒక సన్నివేశాన్ని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. సర్వసైన్యాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈ తరుణంలో సినిమాలోని దేవసేన ఆ సర్వసైన్యాధ్యక్షుడి వేలు నరికేస్తుంది. అయితే తర్వాత రాజ మందిరంలో వేలు నరికిన ఘటనపై విచారణ జరుగుతంది. ఇంతలో బాహుబలి సభామందిరంలోకి వచ్చి తప్పు చేశావు దేవసేనా... నరకాల్సింది తప్పు చేసిన వాడి వేలు కాదు తల అంటూ... ఆ సర్వసైన్యాధ్యక్షుడి తలను నరికేస్తాడు.
ఇక ఈ డైలాగ్ ను ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కలెక్టర్ దేవసేన వివాదంలో అన్వయిస్తున్నారు నెటిజన్లు. తప్పు చేశావు దేవసేన...ఎమ్మెల్యే అడ్డంగా దొరికితే పెట్టాల్సింది ప్రెస్ మీట్ కాదు... లీగల్ కేసులు అంటూ సెటైర్ వేస్తున్నారు.
సినిమాలోని క్యారెక్టర్లకు, ఎమ్మెల్యే, కలెక్టర్ వివాదానికి సంబంధించిన వార్తలతో జత చేస్తూ సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరి వివాదంపై కొత్త కొత్త సెటైర్ లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి