డేటా చోరీ ముఠా గుట్టు రట్టు : సైబరాబాద్ పోలీసులపై ప్రశంసలు, డేటా ప్రొటెక్షన్ బిల్ కావాలంటున్న నెటిజన్లు

By Siva KodatiFirst Published Mar 25, 2023, 7:59 PM IST
Highlights

16 కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేసి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు గురువారం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసిన వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా డేటా ప్రొటెక్షన్ బిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు.
 

సైబరాబాద్ పోలీసులు నాలుగు రోజుల క్రితం 16 కోట్ల మంది డేటా చోరీ చేసి దానిని దుర్వినియోగం చేస్తున్న ముఠాను పట్టుకొని కేసు నమోదు చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ప్రజల వ్యక్తిగత సమాచారం ఎక్కడ ఎలా ఇచ్చినా అది పరుల చేతిలోకి వెళ్ళిపోతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల వ్యక్తిగత సమాచారానికి భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారింది. అందుకే ఈ అరెస్ట్, కేసు, సైబరాబాద్ పోలీసుల పనితనం గురించి ఇంటర్నెట్ లో చర్చ జరిగింది. సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా ఈ ముఠాను పట్టుకోవటంతో ఈ డేటా లీక్ స్కాం వెలుగుచూసిందని నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబరాబాద్ పోలీసులను అభినందిస్తూనే.. ప్రధానమంత్రిని, ఇతర ప్రముఖ రాజకీయ నాయకులను సోషల్ మీడియా వేదికగా డేటా ప్రొటెక్షన్ బిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు నెటిజన్లు. తక్షణం పార్లమెంట్ లో డేటాను రక్షించేలా చట్టం చేయాలని, ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని పరిరక్షించాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై ట్విట్టర్ లో #CybPoliceBustedDataLeak పేరుతో ట్రెండ్ అవుతోంది. 

కాగా.. వ్యక్తుల వ్యక్తిగత డేటాను అక్రమంగా యాక్సెస్ చేసి విక్రయిస్తున్న ఏడుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు గురువారం ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 'నిందితులు సేకరించి, భద్రపరిచిన మొత్తం డేటాను సుర‌క్షితంగా ఉంచ‌డంతో పాటు ఎలాంటి మార్పులు చేయకుండా చూడాలని గూగుల్ కు లేఖ రాశాం. క్లౌడ్ లోని డేటాను ఫోరెన్సిక్ విశ్లేషించిన తర్వాతే ఎంత సమాచారం చోరీకి గురైందో తెలుస్తుంది..' అని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు.

Also REad: 16 కోట్ల భార‌తీయుల వ్యక్తిగత డేటా చోరీ.. గూగుల్ కు సైబ‌రాబాద్ పోలీసుల లేఖ

వ్యక్తిగత డేటా చోరీకి పాల్పడ్డ మొత్తం 12 మందిని అరెస్టు చేశామని, నలుగురికి నోటీసులు ఇచ్చామని పోలీసులు తెలిపారు. అలాగే, నిందితుల నుంచి మొబైల్‌ ఫోన్లు, ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన నిందితులు కుమార్ నితీశ్ భూషణ్, కుమారి పూజా పాల్, సుశీల్ థోమర్, అతుల్ ప్రతాప్ సింగ్, ముస్కాన్ హసన్, సందీప్ పాల్, జియా యువర్ రెహ్మాన్ ను క్లౌడ్ తో పాటు హార్డ్ డిస్క్ లలో డేటాను నిక్షిప్తం చేశారని పోలీసులు తెలిపారు. నీట్ పరీక్షకు అర్హులైన విద్యార్థులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్లు, బ్యాంకు కస్టమర్లు, పాన్ కార్డు వినియోగదారులు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ సిబ్బంది, వివిధ రంగాలకు చెందిన నిపుణులు ఇలా వివిధ కేటగిరీల్లో డేటాను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఈ డేటా పరిమాణం చాలా పెద్దదని చెప్పారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి కొనుగోలుదారులను గుర్తించేందుకు పోలీసులు వేచి చూస్తున్నారు. ఈ ఉల్లంఘనల‌కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు వివిధ ప్రభుత్వ శాఖలను అప్రమత్తం చేసే పనిలో ఉన్నారు.

click me!