National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన నేడు ఈడీ మరోసారి విచారణ జరపనుంది. ఈ క్రమంలోనే మంగళవారం కాంగ్రెస్ నేతలు ఈడీ ముందుకురానున్నారు.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కు సంబంధించిన ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి విచారణ మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరపనుంది. ఈ క్రమంలోనే మంగళవారం కాంగ్రెస్ నేతలు ఈడీ ముందుకురానున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నేడు ఈడీ ముందు హాజరు కానున్నారని సమాచారం. ఈడీ ముందు విచారణకు హాజరయ్యే నేతల్లో జె.గీతారెడ్డి, షబ్బీర్ అలీ, పీ.సుదర్శన్ తదితరులు ఉన్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, కర్నాటక కాంగ్రెస్ నేతలను సైతం ఈడీ తమముందు విచారణకు రావాలని కోరింది. అక్టోబర్ 7న హాజరుకావాలని కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, ఆయన సోదరుడు డీకే సురేష్లకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
యంగ్ ఇండియా, డాటెక్స్ కనెక్షన్ గురించి నాయకులందరినీ ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ సంస్థ కోల్కతాలోని బల్లిగంజ్లోని శ్రీపల్లిలోని లోయర్ రాడన్ స్ట్రీట్లో ఉన్నట్లు నివేదించబడింది. ఇది ఆకాశ్ దీప్ అనే రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లో ఉంది. “డాటెక్స్ సంస్థ యంగ్ ఇండియాకు కోటి రూపాయలు చెల్లించిందని ఆరోపించారు. ఇది వారు 2010లో యంగ్ ఇండియాకి ఇచ్చిన రుణం. డోటెక్స్ మర్చండైజ్ ఇచ్చిన రుణం తిరిగి రాలేదు. ఈ లోన్ చెల్లించినప్పుడు యంగ్ ఇండియా ఇప్పుడే విలీనం చేయబడింది”అని ఈడీ వర్గాలు పేర్కొంటున్నాయి. యంగ్ ఇండియా ద్వారా డబ్బు లాండరింగ్ జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
కాగా, నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఇదివరకు కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీని సైతం ఈడీ విచారణ జరిపింది. దాదాపు 50 గంటలకు పైగా ఆయనను ఈడీ విచారించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారించింది. ఆ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు వ్యతిరేకంగా నిరసనలకు సైతం దిగాయి. రాజకీయ కక్షతోనే అధికార పార్టీ బీజేపీ.. దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన వివరాలు..
నవంబర్ 1, 2012: నేషనల్ హెరాల్డ్ కేసులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మాజీ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఫిర్యాదు నమోదుచేశారు.
జూన్ 26, 2014: కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు సమన్లు అందాయి.
ఆగస్టు 1, 2014: ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ నిరోధక కేసు నమోదు చేసింది.
డిసెంబర్ 19, 2015: రాహుల్, సోనియా గాంధీలకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
2016: కేసును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించింది.
2019: నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక 64 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఏజెన్సీలు స్వాధీనం చేసుకున్నాయి.
డిసెంబర్ 2020: కాంగ్రెస్ నాయకుడు మోతీలాల్ వోరా మరణించారు.
సెప్టెంబర్ 2021: కాంగ్రెస్ నాయకుడు ఆస్కార్ ఫెర్నాండెజ్ మరణించారు.
కాగా, ఇదివరకు ఈ కేసులో క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మళ్లీ దినిని దర్యాప్తు సంస్థలు తెరిచాయి. రాజకీయ కక్షతోనే అధికార పార్టీ దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.