కూకట్‌పల్లి టీడీపీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కుమార్తె..?

By sivanagaprasad kodatiFirst Published Nov 14, 2018, 7:41 AM IST
Highlights

మహాకూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ... కూటమిలోని మిగిలిన పార్టీలతో సీట్ల విషయంలో ఎలాంటి పేచి పెట్టడం లేదు. అదే సమయంలో తనకు బాగా పట్టున్న ప్రాంతాలనే ఎంచుకుని.. అక్కడి నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. 


మహాకూటమిలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం పార్టీ... కూటమిలోని మిగిలిన పార్టీలతో సీట్ల విషయంలో ఎలాంటి పేచి పెట్టడం లేదు. అదే సమయంలో తనకు బాగా పట్టున్న ప్రాంతాలనే ఎంచుకుని.. అక్కడి నుంచి బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.

ఈ క్రమంలో తొలి జాబితాలో తొమ్మిది మందిని ప్రకటించింది.. అయితే గ్రేటర్ పరిధిలోని కీలక నియోజకవర్గాలను సస్పెన్స్‌లో పెట్టింది. ఇక హైదరాబాద్‌లో తొలి నుంచి తెలుగుదేశానికి పట్టున్న కూకట్‌పల్లి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ స్థానం కోసం పార్టీలోని కొందరు సీనియర్లు పట్టుబడుతున్నప్పటికీ తెలుగుదేశం హైకమాండ్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇక్కడి నుంచి ఎన్టీఆర్ కుటుంబంలోని ఒకరిని బరిలోకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ సీనియర్ నేత, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ కుటుంబంలోని ఒకరికి ఈ సీటును కేటాయించే అవకాశం కనిపిస్తోందని పార్టీలో చర్చ జరుగుతోంది. హరికృష్ణ కుమార్తె సుహాసినీ టీడీపీ అభ్యర్థిగా ఖరారైనట్లుగా పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయి.

మాజీ ఎంపీ చుండ్రు శ్రీహరి కుమారుడు శ్రీకాంత్ భార్యే సుహాసినీ. ఎన్టీఆర్ కుటుంబాన్ని తెలంగాణ ఎన్నికల్లో బరిలోకి దింపాలని భావిస్తోన్న చంద్రబాబు.. కల్యాణ్‌రామ్ వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.. అయితే తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని.. ప్రస్తుతం రాజకీయాల మీద ఆసక్తి లేదని అన్నట్లుగా టాక్ నడుస్తోంది.

దీంతో సుహాసినీని ఎంపిక చేసినట్లు వార్తలు చక్కర్లు కొడుతోంది. ఈ ఉత్కంఠకు తెరపడాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. అయితే నందమూరి అభిమానులు మాత్రం ఈ వార్త విని సంబరాలు చేసుకుంటున్నారు. 
 

click me!