కార్వీలో అక్రమాలు: సీసీఎస్ కస్టడీకి ఎండీ పార్థసారథి.. నాంపల్లి కోర్ట్ అనుమతి

By Siva KodatiFirst Published Aug 24, 2021, 5:04 PM IST
Highlights

రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని ప్రశ్నించనున్నారు

రుణాల ఎగవేత, నిధుల మళ్లింపుపై ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారథిని కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. న్యాయస్థానం అనుమతి మేరకు రెండు రోజుల పాటు సీసీఎస్ పోలీసులు పార్థసారథిని ప్రశ్నించనున్నారు. కస్టమర్ల పేర్లు కంపెనీ పేర్లుగా నమ్మించి బ్యాంకుల నుంచి కోట్లల్లో రుణాలు పొందింది కార్వీ సంస్థ. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో వున్నారు పార్థసారథి. 

కాగా, కార్వీ కన్సల్టెన్సీలో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రూ. 3 వేల కోట్లకు పైగా కుచ్చుటోపీ పెట్టినట్లు పోలీసులు నిర్థారించారు. దాదాపు లక్షా 20 వేల మంది కస్టమర్లను మోసం చేసినట్లుగా గుర్తించారు. వీరిలో 80 వేల మంది కస్టమర్లకు సెబీ హామీ ఇచ్చింది. ఇప్పటికే కార్వీ ఛైర్మన్ పార్థసారథిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీసీఎస్  పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

పలు బ్యాంకుల నుంచి రూ.2,100 కోట్ల రుణం తీసుకుంది కార్వీ సంస్థ. వీటి ద్వారా రియాల్టీ సంస్థల్లో రూ.1000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. రూ.50 కోట్లకు పైగా ఆస్తులు సైతం గుర్తించారు. కార్వీ సంస్థ  నిధుల మొత్తాన్ని రియాల్టీతో పాటు ఇన్ఫో రంగాలకు బదిలీ చేసినట్లుగా  పోలీసులు గుర్తించారు. రెండు సంస్థల్లో భారీ నష్టాలను చూపించారు పార్థసారథి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు తీసుకున్నారు పార్థసారథి. సీసీఎస్‌లో ఇప్పటికే పార్థసారథిపై మూడు కేసులు నమోదయ్యాయి. అటు సైబరాబాద్‌లో పార్థసారథిపై ఐసీఐసీఐ బ్యాంక్ ఫిర్యాదు చేసింది.

click me!