మూసీకి తగ్గిన వరద: మూసారాంబాగ్ బ్రిడ్జిపై పేరుకున్న బురద తొలగింపు

By narsimha lodeFirst Published Jul 28, 2022, 12:46 PM IST
Highlights

మూసీ నదికి వరద తగ్గింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై పేరుకున్న చెత్తను, బురదను జీహెచ్ఎంసీ సిబ్బంది క్లీన్ చేస్తున్నారు. భారీ వరద కారణంగా బ్రిడ్జి రెయిలింగ్, పుట్ పాత్ దెబ్బతింది. 
 


హైదరాబాద్: Musi  నదికి వరద తగ్గింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు  ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద కూడా వరద తగ్గింది. అయితే మూసారాంబాగ్ బ్రిడ్జిపై బురద, చెత్త పేరుకుపోయింది.మూసీ వరద కారణంగా మూసారాం బాగ్ బ్రిడ్జి రెయిలింగ్, పుట్ పాత్ కొట్టుకుపోయింది. ఈ బ్రిడ్జిపై వరద నీటిలో కొట్టుకు వచ్చిన బురద, చెత్తను, జీహెచ్ఎంసీ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు. మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. ఈ ప్రాంతంలో ట్రాపిక్ ను మళ్లించారు.

సోమవారం నాడు రాత్రితో పాటు మంగళవారం నాడు కురిసిన వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. మంగళవారం నాడు సాయంత్రం నుండి వర్షం తగ్గుముఖం పట్టింది. దీంతో మూసీకి వరద తగ్గింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో మూసీ నదికి వరద పోటెత్తింది. 100 ఏళ్ళలో ఏనాడూ రాని వరదలు మూసీకి ఈ దఫా వచ్చాయి. ఇదిలా ఉంటే హైద్రాబాద్ నగరానికి మంచినీటిని అందించే జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ల  గేట్లు ఎత్తి మూసీలోకి నీటిని విడుదల చేయడంతో మూసీకి వదర పెరిగింది. అయితే ఈ రెండు జంట జలాశయాలకు వరద తగ్గడంతో మూసీకి కూడా వరద తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

బుధవారం నాడు మూసీపై మూడు బ్రిడ్జిలపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు పురానాపూల్ వద్ద ఉన్న బ్రిడ్జి, చాదర్ ఘాట్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి, మూసారాంబాగ్ వద్ద బ్రిడ్జిలపై రాకపోకలను నిలిపివేశారు. మూసారాంబాగ్ వద్ద గురువారం నాడు ఉదయం కూడా రాకపోకలు పునరుద్దరించలేదు. ఈ బ్రిడ్జిపై బురదను క్లీన్ చేస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది. 

బుదవారం నాడు ఉస్మాన్ సాగర్  13 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. మరో వైపు హిమాయత్ సాగర్ కు చెందిన గేట్లను కూడా ఎత్తి మూసిలోకి నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ 8 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు

మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు, బస్తీల్లోకి వరద నీరు చేరింది. మూసీకి గురువారం నాడు వరద తగ్గడంతో ముంపునకు గురైన ప్రాంతాల్లో కూడా వరద నీరు తగ్గుతుంది. అయితే  వరద తెచ్చిన బురదతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. చాదర్ ఘాట్ వద్ద అండర్ బ్రిడ్జికి సమీపంలో ఉన్న శంకర్ నగర్, మూసా నగర్ వంటి కాలనీ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. వర్షాలు తగ్గడంతో  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు కూడా  వరద తగ్గింది.
 

click me!