
హైదరాబాద్ మరో దారుణం చోటుచేసుకుంది. సంక్రాంతి పండగ పూట సరదాగా మద్యం తాగుతూ ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన గొడవ ఒకరి దారుణ హత్యకు దారితీసింది. నడిరోడ్డుపైనే జరిగిన ఈ దారుణ హత్య పాతనగరంలోని చార్మినార్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
ఓల్డ్ సిటీ ఘాన్సీబజార్కు చెందిన రవి (పీటర్ రవి),మరో ముగ్గురు వ్యక్తులు కలిసి మామాజుమ్మా పాఠక్ ప్రాంతంలోని పురాతన శివాలయం సమీపంలో ఫుల్లుగా మద్యం సేవించారు. ఇలా మద్యం మత్తులో మునిగిపోయిన వీరి మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో వీరు పరస్పరం ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. ఈ గొడవ కాస్తా పెద్దదై నడిరోడ్డుపైనే కత్తులతో దాడులు చేసుకునే స్థాయికి చేరింది.
ఈ గొడవలో పీటర్ రవిపై మిగతా ఇద్దరు కత్తులతో దాడి చేశారు. దీంతో అతడు తీవ్రంగా గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘర్షణ కారణంగా మంగళ వారం అర్థరాత్రి తీవ్ర కలకలం రేగింది.
స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని ఈ హత్యకు పాల్పడిన దుండగుల కోసం గాలిస్తున్నారు. రవి హత్యకు పాతకక్ష్యలే కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోని దర్యాప్తు చేస్తున్నారు.