మునుగోడు ఉప ఎన్నికలు 2022: కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ గా దామోదర్ రెడ్డి నియామకం

By narsimha lodeFirst Published Sep 16, 2022, 3:04 PM IST
Highlights

మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహత్మకంగా ముందుకు వెళ్తుంది.ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో  ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.  ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మెన్ గా రారెండ్డి దామోదర్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం.

హైదరాబాద్:  మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను  మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి పార్టీ నాయకత్వం అప్పగించింది. గతంలో ఈ బాధ్యతలను మాజీ ఎంపీ , ఎఐసీసీ కార్యదర్శి మధు యాష్కీకి అప్పగించారు. తనను నియోజకవర్గానికే పరిమితం చేయడంపై యాష్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ బాధ్యతలను ఆయన తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అప్పగించింది. ఇప్పటికే  చౌటుప్పల్ మండలానికి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఇంచార్జీగా ఉన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన  నాయిని రాజేందర్ రెడ్డి కూడా ఇదే మండలానికి ఇంచార్జీగా పార్టీ నియమించిన విషయం తెలిసిందే. 

ఈ ఏడాది ఆగస్టు 4 వ తేదీన  కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. అదే నెల 8వ తేదీన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.  ఈ ఏడాది ఆగస్టు 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో  మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలను ఆరు మాసాల్లోపుగా జరగాల్సి ఉంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో   కాంగ్రెస్ అభ్యర్ధిగా పాల్వాయి స్రవంతి బరిలోకి దిగనున్నారు. 10 రోజుల క్రితమే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు వెళ్లి స్థానిక నేతలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. 

ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఆశించిన నేతలతతో కూడా టీపీసీసీ చీఫ్  రేవంత్ రెడ్డి గత వారం సమావేశమయ్యారు. అభ్యర్ధి ఎంపిక విషయంలో తీసుకున్న అంశాల ను వివరించారు. మునుగోడులో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. 

also read:మునుగోడు నేతలతో నేడు కూడా రేవంత్ భేటీ: ప్రచార వ్యూహంపై చర్చ

2018 ఎన్నికల్లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా  బరిలో దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. పార్టీ క్యాడర్ రాజగోపాల్ రెడ్డి వైపు వెళ్లెకుండా ఉండేందుకు గాను  ఆ పార్టీ నాయకత్వం చర్యలు చేపట్టింది. 
 

click me!