
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు భేటీ అయ్యారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి 6 లేన్ల విస్తరణపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి గడ్కరీ కార్యాలయం జీఎంఆర్ ప్రతినిధులను పిలిచింది. జాతీయ రహదారి విస్తరణపై పలుమార్లు కేంద్ర మంత్రిని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. హైవే విస్తరణలో కాంట్రాక్టర్ల సమస్య, డిజైనింగ్లో సాంకేతిక లోపాలపై ఎంపీలు కేంద్రమంత్రికి వివరించారు. ఈ క్రమంలోనే నెలలోగా పరిష్కరించాలని కేంద్ర మంత్రి గడ్కరీ సంబంధిత అధికారులను ఆదేశించినట్టుగా తెలిసింది.
ఈ సమావేశం అనంతరం ఎంపీ కేశినాని మాట్లాడుతూ.. విజయవాడ-హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి సిక్స్ లైన్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కేంద్ర మంత్రి గడ్కరీ, ఎన్హెచ్ఏ అధికారులతో చర్చలు జరిపినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక నెలలో నిర్ణయం తీసుకుంటామని నితిన్ గడ్కరీ చెప్పినట్లు తెలిపారు. త్వరలో ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందన్నారు. జీఎంఆర్ కింద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఉందని, అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు.
జీఎంఆర్ కింద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి ఉందని, అయితే కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయన్నారు. ఇబ్రహిపట్నం, అమరావతి ఎన్హెచ్ 30 జాతీయ రహదారి విస్తరణకు అనుమతి ఇవ్వాలని కోరినట్టుగా చెప్పారు. అలాగే విజయవాడ పార్లమెంట్ పరిధిలోని పలు రోడ్లకు సంబంధించి విషయాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లినట్టుగా చెప్పారు. వాటికి ఆయన నుంచి హామీ లభించిందని తెలిపారు.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 6 లైన్ల విస్తరణలో సమస్యలన్నీ నెలలో పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ హామీ ఇచ్చినట్టుగా చెప్పారు. మేలో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారని తెలిపారు. హైవేలో ఉండాల్సిన డిజైన్ లేదని.. అక్కడి సమస్యలను కేంద్రమంత్రితో చర్చించినట్టుగా చెప్పారు.