ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని వివాహిత తన ప్రియుడితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాదులోని కాచిగుడాలో చోటు చేసుకుంది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. చెప్పల్ బజారులో నివాసం ఉంటున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి తన భార్య (23) కనిపించడం లేదని కాచిగుడా పోలీుసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ నెల 11వ తేదీన ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య తిరిగి రాలేదని అతను మంగళవారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి సమీపంలో ఉన్న కర్ణాటక రాష్ట్రానికి ెచందిన ఆటో డ్రైవర్ హనుమంతు (23) ఇంటికి ఆమె వెళ్లింది.
గురువారం రాత్రి హనుమంతు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహిళ నిద్రమాత్రలు మింగి మరణించింది. సమాచారం అందుకున్న కాచిగుడా పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వారిద్దరు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు వారు తెలిపారు. వారు ఆత్మహత్య చేసుకున్నారా, ఎవరైనా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.