అన్నం పెట్టిన పార్టీపై విమర్శలా.. కేసీఆర్ లేకుంటే 6 సార్లు గెలిచేవారా: ఈటలపై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

By Siva KodatiFirst Published Jun 12, 2021, 9:02 PM IST
Highlights

తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్‌తో ఐదేళ్ల క్రితం గ్యాప్ ఏర్పడితే అప్పుడే మంత్రి పదవి ఎందుకు వదులుకోలేదు? అని ప్రశ్నించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్‌తో ఐదేళ్ల క్రితం గ్యాప్ ఏర్పడితే అప్పుడే మంత్రి పదవి ఎందుకు వదులుకోలేదు? అని ప్రశ్నించారు. కేసీఆర్, టీఆర్ఎస్ వల్లే ఈటలకు గౌరవం దక్కిందన్నారు. కేసీఆర్ అండ లేకుండా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవారా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును జైలులో పెట్టిన బీజేపీలో ఎలా చేరుతున్నారు? అని నిలదీశారు. ఈటల బీజేపీలో చేరి పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తారా? అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అన్నం పెట్టిన పార్టీపైనే విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు.

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... నెల క్రితం బీజేపీపై విమర్శలు చేసిన విషయం ఈటలకు గుర్తు లేదా అంటూ ఎద్దేవా చేశారు. నల్ల చట్టాలు తెచ్చారని, రైతులపై కాల్పులు చేస్తున్నారని బీజేపీపై విమర్శలు చేయలేదా అంటూ పల్లా మండిపడ్డారు. నాడు దయ్యాలుగా కనిపించిన బీజేపి నేడు దైవం అయ్యిందా అంటూ రాజేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ భూములు, దేవాదాయ భూములు ఎలా కొంటావంటూ పల్లా ప్రశ్నించారు. ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇచ్చింది కేసీఆరేనని గుర్తుంచుకోవాలంటూ ఆయన హితవు పలికారు. 

Also Read:నెల క్రితం బీజేపీ దయ్యం.. ఇప్పుడు దైవమైందా: ఈటలపై పల్లా విమర్శలు

కాగా, మాజీ మంత్రి ఈటల రాజేందర్ శనివారం ఉదయం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ కార్యాలయంలో ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు. అంతకు ముందు ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. హుజూర్ నగర్ లో జరిగేది కేసీఆర్ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య పోరాటమని ఆయన అన్నారు. కేసీఆర్ పాలనకు ఘోరీ కట్టాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. 

click me!