మే 5న హన్మకొండలో మంత్రి కేటీఆర్ బహిరంగ సభ.. ఏర్పాట్లను పరిశీలించిన చీఫ్ విప్ వినయ్ భాస్కర్

By Mahesh RajamoniFirst Published May 2, 2023, 2:59 AM IST
Highlights

Hanamkonda: ఈనెల (మే) 5న రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్ట‌ర్ కేటీ రామారావు (కేటీఆర్) హ‌న్మ‌కొండ‌లో పర్యటించనున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. 
 

Telangana MA&UD Minister KT Rama Rao: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే.తారక రామారావు (కేటీఆర్) ఈ నెల 5న హ‌న్మ‌కొండ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. సుమారు రూ.150 కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపన చేయడంతో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, సైన్స్ పార్కును మంత్రి ప్రారంభించనున్నారు. ఈ క్ర‌మంలోనే అక్క‌డ భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కాజీపేటలోని సెయింట్ గాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్స్ లో మే 5న జరిగే కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను చీఫ్ విప్ డీ.వినయ్ భాస్కర్ ప‌రిశీలించారు. 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని ప్రభుత్వ చీఫ్ విప్ డీ.వినయ్ భాస్కర్ అన్నారు. సోమవారం సెయింట్ గాబ్రియేల్ స్కూల్ గ్రౌండ్స్ లో మంత్రి కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయ‌ని తెలిపారు. నగరంలో వర్షపు నీరు ఉప్పొంగకుండా రిటైనింగ్ వాల్ పనులను కేటీఆర్ ప్రారంభిస్తారనీ, ఇందుకోసం ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లు కేటాయించిందని తెలిపారు. బాలసముద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం, మోడల్ వైకుంఠధామం, సైన్స్ పార్కును కేటీఆర్ ప్రారంభిస్తారని, సుమారు రూ.150 కోట్ల విలువైన పలు పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్ విప్ తెలిపారు. 

అలాగే, పేద‌ల అభ్యున్న‌తి కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోని బీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌నీ, ఆశ్ర‌యం కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని వినయ్ భాస్క‌ర్ తెలిపారు. ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టిన అనంతరం సెయింట్ గాబ్రియేల్ మైదానంలో జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగిస్తార‌ని పేర్కొన్నారు. బహిరంగ సభకు 50 వేల మంది పార్టీ కార్యకర్తలను సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, బీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.

అంతకుముందు అంత‌ర్జాతీయ కార్మిక దినోత్స‌వాన్ని పురుస్క‌రించుకుని మేడే వేడుకల్లో పాల్గొన్న చీఫ్ విప్ విన‌య్ భాస్క‌ర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కార్మికవర్గాన్ని ఆదుకుంటోందన్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికుడి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం రూ.6 లక్షలు చెల్లిస్తోందని తెలిపారు. 2014 నుంచి 2023 వరకు ప్రమాదవశాత్తు మరణించిన 4,001 కుటుంబాలకు ప్రభుత్వం రూ.223 కోట్లు ఆర్థిక సాయంగా చెల్లించిందని తెలిపారు. మే 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు జరిగే కర్మకా శంఖారావ మహోత్సవంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక శంఖారావం కన్వీనర్ పుల్లా శ్రీనివాస్ కూడా పాల్గొన్నారు.

click me!