
నందమూరి హరికృష్ణ కుటుంబంపై ఎంతో ప్రేమ ఉన్నట్లు చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్నారని కేటీఆర్ అన్నారు. అంత ప్రేమే ఉంటే నందమూరి సుహాసినికి కూకట్ పల్లి టికెట్ కాకుండా ఇటీవల జరిగిన ఏపి మంత్రి వర్గ విస్తరణలో స్థానం ఎందుకు కల్పించలేదని కేటీఆర్ ప్రశ్నించారు. దమ్మంటే తన కొడుకు లోకేష్కు కూకట్ పల్లి అభ్యర్థిగా బరిలోకి దించాల్సిందని అన్నారు.కానీ తన కొడుకును ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకున్నా మంత్రిని చేసిన చంద్రబాబు సుహాసినిని ఎన్నికల బరిలోకి దింపి బలిపశువును చేస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు.
ఇవాళ కూకట్ పల్లి నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు మహాకూటమి నాయకులపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇన్నాళ్లు చంద్రబాబుకు తెలంగాణ గుర్తు రాలేదా? కేవలం ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తుందని ఎద్దేవా చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చంద్ర బాబు కొనేందుకు ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మళ్లీ కూకట్ పల్లిలో టిడిపి గెలిస్తే అభివృద్దిలో వెనుకబడుతుందని ... కాబట్టి టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని సూచించారు. కేసీఆర్ ను ఓడించేందుకు నాలుగు పార్టీలు ఏకమయ్యాయని...వారి కుట్రలను తిప్పికొట్టాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు.
సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. రైతు బంధు పథకంతో కేసీఆర్ రైతుల్లో భరోసా కల్పించారని అన్నారు. మరిన్ని అభివృద్ది పనులు చేసేందుకు మరోసారి తమకు అవకాశం కల్పించాలని కేటీఆర్ ప్రజలను కోరారు.