రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం.. మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్

By Sumanth KanukulaFirst Published Oct 8, 2022, 2:09 PM IST
Highlights

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పూటకో మాట చెబుతారని విమర్శించారు. 

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ పూటకో మాట చెబుతారని విమర్శించారు. కాంట్రాక్టుల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయాడని ఆరోపించారు. రూ. 20 వేల కోట్లు కాంట్రాక్టులు పొందినట్టుగా రాజగోపాల్ రెడ్డి ఒప్పుకున్నారని అన్నారు. రాజగోపాల్ రెడ్డి దొరికిపోయిన దొంగ అని ఆరోపించారు. ఈ విషయంలో రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. 

మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినట్టుగా బహిర్గతమైందన్నారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి.. త్యాగాలు చేశామని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు సీట్లున్న పార్టీలోకి వెళితే మునుగోడు నియోజకర్గం అభివృద్ది చెందుతుందా అని ప్రశ్నించారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై కుట్రలో భాగంగానే బీజేపీ మునుగోడు ఉప ఎన్నిక తీసుకొచ్చిందన్నారు. మునుగోడు ప్రజలు బాగా ఆలోచించి అభివృద్ధి చేసే పార్టీకే పట్టం కట్టాలని కోరారు. 

బీజేపీకి ఓటేస్తే మోటార్లకు మీటర్లు వస్తాయని అన్నారు. దేశంలో నిత్యావసరాలతో పాటు అన్ని రేట్లు పెరుగుతాయని చెప్పారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే పెండింగ్ పనులు అన్నీ పూర్తి చేస్తామని.. అభివృద్ధి పనులు కొనసాగుతాయని వివరించారు.  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వార్ధం కోసమే మునుగోడు ఉప ఎన్నిక అని అన్నారు. రాజగోపాల్ రెడ్డి బరితెగించి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎక్కడికక్కడ రాజగోపాల్ రెడ్డిని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. 

click me!