
నిర్మల్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. నిర్మల్ పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జలమయమైన ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పట్టణంలోని మంజూలా పూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు.
జోరు వానలో, మోకాల్లోతు నీటిలో కాలనీల పర్యటన చేపట్టారు మంత్రి. అధికారులను వెంటపెట్టుకుని పట్టణంలో పర్యటించిన మంత్రి సమస్యలను గుర్తించి అక్కడికక్కడే పరిష్కారానికి సూచనలిచ్చారు. అలాగే వర్షాలతో ఇబ్బందులకు ఎదుర్కొంటున్న ప్రజలకు భరోసా కల్పించారు. కాలనీ వాసులతో సమస్యలపై చర్చించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు.
వీడియో
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... నిర్మల్ చరిత్రలో గతంలో ఎన్నడూ కూడా ఇంతటి వర్షం కురవలేదన్నారు. పలు కాలనీలు జలమయ్యాయని... ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. నిత్యావసరాలు, తాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్థానిక ప్రజలు కూడా బాధితులకు సహాయం చేయాలని కోరారు.
అనంతరం జిల్లా అధికారులతో కలెక్టరేట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ వర్షం ఇలాగే కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. వర్షాల వల్ల ఎలాంటి నష్టం వాటిల్లకుండా అధికారులు ముందస్తు చర్చలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. వర్ష ప్రభావిత అన్ని గ్రామాలు, పట్టణాల నుంచి ఎప్పటికప్పుడు నివేదిక తెప్పించుకుని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.