టీఆర్‌ఎస్ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు.. బండి సంజయ్‌కు మంత్రి గంగుల వార్నింగ్..

Published : Mar 19, 2022, 01:58 PM IST
టీఆర్‌ఎస్ శ్రేణులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదు.. బండి సంజయ్‌కు మంత్రి గంగుల వార్నింగ్..

సారాంశం

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికిపాల్పడటం దుర్మార్గమైన చర్య అని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని బీజేపీ నమ్ముకుందని విమర్శించారు.

రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేటలో శుక్రవారం టీఆర్‌ఎస్, బీజేపీ కార్యకర్తల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి బీజేపీపై మంత్రి గంగుల కమలాకర్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్యను  మంత్రి గంగుల కమలాకర్ శనివారం ఉదయం పరామర్శించారు. అనంతరం గంగుల మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ కనుమరుగు అవుతుందనే అక్కసుతోనే ఆ పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడికిపాల్పడటం దుర్మార్గమైన చర్య అన్నారు. యూపీ, గుజరాత్, బీహార్ సంసృతిని బీజేపీ నమ్ముకుందన్నారు. తమపై దాడులు చేస్తే ఊరుకోమని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క టీఆర్‌ఎస్ కార్యకర్తపైన దాడులకు దిగిన పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. బీజేపీ సంస్కృతి ఇదేనా అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు. 

బండి సంజయ్‌పై నమ్మకం లేకనే బీజేపీకి చెందిన కార్పొరేటర్లు మంత్రి కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారని చెప్పారు. దీనిని  జీర్ణించుకోలేక బీజేపీ నేతలు.. టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రామచంద్రం అనే బీజేపీ కార్యకర్త పెట్టిన పోస్టులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని.. వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై దాడిచేశారని చెప్పారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వెల్లడించారు. 

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. బండి సంజయ్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్‌ను బద్నామ్ చేసేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ కార్పొరేటర్లు.. ప్రభుత్వం చేస్తున్న అభివృద్దిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరుతుంటే బండి సంజయ్‌కు ఏం చేయాలో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బండి సంజయ్‌ ఆదేశాలతోనే టీఆర్‌ఎస్ శ్రేణుల మీద దాడి జరిగిందని ఆరోపించారు.  బీజేపీ వాళ్లు పిడికెడే.. మేం పుట్టెడు మంది ఉన్నామని చెప్పారు. బుల్డోజర్‌ వచ్చేదాకా మేం ఊరుకుంటామా.. తొక్కితే పాతాళానికి పోతారని హెచ్చరించారు. తాము దాడులు జరిపితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Purandeswari Pays Tribute to NTR: ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన పురందేశ్వరి | Asianet News Telugu
NTR 30th Vardanthi: ఎన్టీఆర్ ఘన నివాళి అర్పించిన నందమూరి కళ్యాణ్ రామ్| Asianet News Telugu