వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు వద్దు: మంత్రి ఈటల

By Siva KodatiFirst Published Jan 15, 2021, 6:02 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మొదటి విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం అవుతుందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు మొదటి విడత వ్యాక్సినేషన్‌ ప్రారంభం అవుతుందన్నారు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌. రేపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ జరుగుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా 140 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ఉంటుందని, డీసీజీఐ ఆమోదం పొందిన వ్యాక్సిన్‌ మాత్రమే అందిస్తున్నామని వెల్లడించారు. మొదటి విడత ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే వారికి టీకా వేస్తామన్నారు.

రెండో విడతలో ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బందికి టీకా వేయడం జరుగుతుందని ఈటల వెల్లడించారు. వ్యాక్సిన్‌పై అనుమానాలు, అపోహాలు అవసరం లేదని రాజేందర్ స్పష్టం చేశారు.

మొత్తం నెల రోజుల వ్యవధిలో ఒక్కొక్కరికి రెండో డోసులు చొప్పున వేస్తామన్నారు. తొలి డోసుగా ఏ కంపెనీ వ్యాక్సిన్‌ను వేస్తామో రెండో డోసుగా అదే  తీసుకోవాలని మంత్రి సూచించారు.

అయితే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్రం సూచనల మేరకు 18 ఏళ్ల లోపు వారు, గర్భిణీలకు టీకా వేయడం లేదని ఈటల ప్రకటించారు.

శనివారం ప్రతి కేంద్రంలో 30 మందికి వ్యాక్సినేషన్‌ ఉంటుందని.. టీకా తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే పారాసిటమాల్‌ తీసుకోవాలని రాజేందర్ సూచించారు. 

click me!