వామన్ రావు కేసు: బిట్టు శ్రీనుకి ఏడు రోజుల పోలీస్ కస్టడీ, మంథని కోర్ట్ ఆదేశాలు

By Siva KodatiFirst Published Feb 27, 2021, 3:56 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీనును న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతించింది

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లాయర్ వామన్ రావు దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా వున్న బిట్టు శ్రీనును న్యాయస్థానం పోలీస్ కస్టడీకి అనుమతించింది. అతనిని కస్టడీకి అనుమతించాల్సిందిగా పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన మంథని కోర్టు బిట్టు శ్రీనును వారం రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. 

కాగా, వామన్‌రావు కేసులో ప్రధాన నిందితుడు బిట్టు శ్రీనును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హంతకులకు ఆయుధాలతో పాటు కారు సమకూర్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వామన్ రావు దంపతుల హత్యకు బిట్టు శ్రీను కుట్ర చేసినట్లు తేల్చారు.

శ్రీను నడుపుతున్న పుట్టా ట్రస్ట్‌పై వామన్ రావు కేసులు వేశారు. పిటిషన్‌లతో బిట్టు శ్రీను ఆదాయం కోల్పోయాడని.. దాంతో వామన్ రావుపై కక్ష పెంచుకున్నాడని చెప్పారు పోలీసులు.

Also Read:వామన్‌రావు కేసులో ట్విస్ట్: దర్యాప్తును సీబీఐకి అప్పగించండి.. హైకోర్టులో కిషన్‌రావు పిటిషన్

ఆదాయ మార్గాలు గండి కొట్టినందుకు వామన్ ‌రావును హత్య చేసేందుకు బిట్టు శ్రీను కుట్ర చేశాడని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. మరోవైపు ఈ కేసులో మరో నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ రోజు లేదా రేపు అతనిని అదుపులోకి తీసుకునే అవకాశం వుందని సమాచారం. ఈ హత్య కేసులో మొత్తం ఐదుగురి ప్రమేయం వున్నట్లు పోలీసులు తేల్చారు.కుంట శ్రీను, బిట్టు శ్రీను, చిరంజీవి, కుమార్‌లను ఇప్పటికే ఖాకీలు అరెస్ట్ చేశారు. 

click me!