వంద రూపాయల కోసం గొడవ: ఓ వ్యక్తి దారుణ హత్య

First Published May 25, 2018, 3:46 PM IST
Highlights

హైదరాబాద్ ఆల్విన్ కాలనీలో దారుణం

కేవలం వంద రూపాయల కోసం జరిగిన గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ దుర్ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇద్దరు మిత్రుల మద్య వంద రూపాయల విషయంలో గొడవ జరగ్గా ఒకరు మృతి చెందారు.    

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన సయ్యద్ పాషా, చాంద్ బీ దంపతులు హైదరాబాద్ కు వలస వచ్చి మూసా పేట జమామసీదు ప్రాంతంలో నివాసముంటున్నారు. వీరు రోజు వారి కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 

పాషా తనతో పాటే కూలీపని చేసే ఓ వ్యక్తికి వంద రూపాయలు అప్పు ఇచ్చాడు. ఈ డబ్బుల విషయంలో గురువారం మద్యాహ్నం ఇద్దరి మద్య గొడవ జరిగింది. దీంతో పాషా ను అతడి స్నేహితుడు కర్రతో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పాషా భార్య చాంద్ బీ భర్త మృతదేహం వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది.

ఈ  ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హత్యపై  కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

click me!