సైకో భర్త: ఇద్దరిని పెళ్లాడి, ఇద్దరినీ చంపేసి.. ఇంట్లోనే మొదటి భార్య శవం పూడ్చివేత

By telugu teamFirst Published May 16, 2021, 7:13 AM IST
Highlights

తెలంగాణలోని వరంగల్ రూరల్ జిల్లాలో ఓ వ్యక్తి ఇద్దరు భార్యలను హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. తొలుత మొదటి భార్యను హత్య చేసి శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టాడు.

వరంగల్: తెలంగాణలోని రూరల్ జిల్లా పర్వతగిరి మండలంలో దారుణమైన సంగటన జరిగింది. పర్వతగిరి మండలంలోని ఏనుగల్లుకు చెందిన వ్యక్తి ఇద్దరిని పెళ్లి చేసుకుని ఇద్దరినీ చంపేశాడు. మొదట ఒక మహిళను పెళ్లి చేసుకుని ఆమెను హత్య చేశాడు. ఆ తర్వాత మరో మహిళను పెళ్లి చేసుకుని ఆమెనూ చంపేశాడు. 

రెండో భార్య కేసులో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. ఆరేళ్ల క్రితం మొదటి భార్యను చంపేసినట్లు విచారణలో తేలింది. ఏనుగల్లుకు చెందిన కర్నె కిరణ్ మొదట రైల్వే స్టేషన్ లో ఓ మహిళను చూసి ప్రేమించానని వెంటపడి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను తరుచుగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతూ వచ్చాడు. దీంతో ఆరేళ్ల క్రితం చంపేశాడు. శవాన్ని ఇంటి ఆవరణలోనే పూడ్చిపెటటాడు. 

వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం ఉప్పల్ కు చెందిన ఓడపల్లి అంజలీ బాయి (43)ని 2019లో కిరణ్ పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లుగా ఆమె ఇంటి వద్దనే ఉండి, ఆరు నెలల క్రితం ఎనుగల్లుకు వచ్చాడు. అప్పటి నుంచి ఇల్లు అమ్మి డబ్బులు తీసుకు రావాలని వేధిస్తూ వచ్చాడు. 

ఆ క్రమంలో ఈ నెల 13వ తేదీన ఆమెను తీవ్రంగా కొట్టాడు. దీంతో ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 14వ తేదీన మరణించింది. దాంతో పోలీసులు కిరణ్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. మొదటి భార్యను కూడా హత్య చేశానని, ఆమె శవాన్ని తాను ఉంటున్న ఇంటి ఆవరణలో పూడ్చి పెట్టానని విచారణలో చెప్పాడు. దాంతో పోలీసులు ఆమె మృతదేహాన్ని ఆదివారంనాడు వెలికి తీయనున్నారు 

కిరణ్ వ్యవహార శైలి బాగా లేకపోవడంతో తల్లిదండ్రులు అతనికి పెళ్లి చేయలేదు. దాంతో అతను అక్కడక్కడా తిరుగుతూ మొదట ఎవరూ లేని అనాథకు వల వేసి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లోనే బంధించి వేధింపులకు గురి చేశాడు. ఆమె అనాథ కావడంతో ఏ విధమైన ఫిర్యాదు కూడా నమోదు కాలేదు.

గతంలో ఓసారి కిరణ్ వ్యవహారశైలిని తెలుసుకుని పర్వతగిరి ఎస్సై రమేష్ నాయక్ అతన్ని హైదరాబాదులోని ఎర్రగడ్డ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించాడు. అయితే, అతను తప్పించుకున్నాడు. గ్రామంలో ఉంటే పోలీసులు మళ్లీ వస్తారని భావించి వరంగల్ లో ఉంటూ హుజూరాబాదులో నర్సుగా పనిచేసే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె ఇంట్లోనే కాపురం పెట్టాడు. 

ఆరు నెలల క్రితం ఏనుగల్లుకు మకాం మార్చి, భార్యను వేధిస్తూ చంపేశాడు. ఈ సంఘటనపై అంజలీబాయి తల్లి ఓడవల్లి భాగ్యలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!