ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది.
నల్గొండ: ప్రేమ వ్యవహారం ఓ వ్యక్తి ప్రాణాలను తీసింది. ఈ ఘటన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది.నల్గొండ జిల్లాలోని చింతపల్లి మండలం వర్కాల గ్రామానికి చెందిన దేవదానం, జ్యోతి దంపతుల కొడుకు శ్రీకాంత్. అతని వయస్సు 20 ఏళ్లు. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె వయస్సు 19 ఏళ్లు. మూడేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకొంటున్నారు.
ఈ నెల 19న శ్రీకాంత్, యువతి గ్రామం విడిచి పారిపోయారు. తమ పరువు పోయిందనే కారణంగా యువతి కుటుంబసభ్యులు శ్రీకాంత్ ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న శ్రీకాంత్ తండ్రి దేవదానం మరణించాడు.యువతి కుటుంబసభ్యులు దాడి చేయడంతోనే దేవదానం మరణించాడని శ్రీకాంత్ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
యువతి కుటుంబపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనను నిరసిస్తూ బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకొన్న నాంపల్లి సీఐ శ్రీనివాస్ రెడ్డి, చింతపల్లి ఎస్ఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకొన్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.