మతం మారినా.. పెళ్లికి ఒప్పుకోలేదని.. ప్రియురాలి గొంతు కోసిన ప్రేమోన్మాది..

By SumaBala BukkaFirst Published Jan 4, 2023, 7:33 AM IST
Highlights

ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు. దానికోసం ఆమె మతానికి కూడా మారాడు. కానీ ఆ తరువాత పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. ప్రేయసి మీద దాడిచేసి గొంతు కోశాడో ప్రేమోన్మాది. 
 

హన్మకొండ : హన్మకొండ జిల్ల కాజీపేటలో ప్రేమోన్మాది ఘాతుకానికి ఒడిగట్టాడు. పెళ్లికి అంగీకరించడం లేదని ప్రేయసి గొంతు కోశాడు. దీంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన మంగళవారం నాడు మండలంలోని కడిపికొండలో జరిగింది. మడికొండ పోలీస్ ఇన్ స్పెక్టర్ గుజ్జేటి వేణు, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...

కాజీపేట మండలం కపిడికొండకు చెందిన సివ్వి శ్రీనివాస్ (35).. తన గ్రామానికే చెందిన ఓ యువతి (26)ను ప్రేమించాడు. ఆమె కూడా ఇతడిని ప్రేమించింది. అయితే, ఇద్దరి మతాలు వేరు. అందుకే శ్రీనివాస్ ఆమె కోసం మతం కూడా మార్చుకున్నాడు. కొంతకాలం వీరి ప్రేమ బాగానే సాగింది. అయితే పెళ్లి చేసుకుందామనుకునేసరికి యువతి తల్లిదండ్రులు వీరి ప్రేమకు, పెళ్లికి ఒప్పుకోలేదు.

దీంతో ఇద్దరి మధ్య కొద్ది కాలంగా గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి ఇదే విషయంగా శ్రీనివాస్ యువతి ఇంటికి వెళ్లాడు. తమ పెళ్లి గురించి మరోసారి యువతిని నిలదీశాడు. తమ కుటుంబ సభ్యులు వద్దంటున్నారని ఆమె అంగీకరించకపోవడంతో.. శ్రీనివాస్ తనతో తెచ్చుకున్నపదునైన ఆయుధంతో యువతి గొంతు, చేయి కోశాడు. 

ప్రేమ పెళ్లి పెట్టిన చిచ్చు: హుజూరాబాద్ లో యువకుడి ఇంటికి నిప్పు

ఇది చూసిన కుటుంబసభ్యులు ఆగ్రహానికి వచ్చి... అతడి మీద దాడి చేశారు. చితకబాదారు. ఈ మేరకు సమాచారం అందండంతో మడికొండ పోలీసులు ఆ గ్రామానికి వెళ్లారు. యువతిని వరంగల్ లోని ఎంజీఎంకు తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమెకు ప్రాణాపాయం లేదని తెలిపారు. పోలీసులు ఈ కేసే విచారణ చేస్తున్నట్లు తెలిపారు. 

ఇదిలా ఉండగా, బెంగళూరులో ఇలాంటి ఘాతుకమే జరిగింది. కర్ణాటకలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఏకంగా కాలేజీలో విద్యార్థినిపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా రక్తం మరకలతో బీభత్సంగా తయారయ్యింది. తను ప్రేమించిన అమ్మాయి తననే ప్రేమించాలని పైశాచికత్వంతో తోటి విద్యార్థులు చూస్తుండగానే తన తోటి విద్యార్థినిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. దీనికి ప్రేమను నిరాకరించడమే ఆమె చేసిన తప్పు. 

ఆ తరువాత ఆ ప్రేమోన్మాది తనను కూడా పొడుకున్నాడు. దీంతో తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషాద ఘటన బెంగళూరు నగర శివారులోని యలహంక సమీపంలోని రాజనకుంటెలో జరిగింది. రాజనకుంటె పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రెసిడెన్సీ విశ్వవిద్యాలయంలో సోమవారం జరిగింది. బాధితురాలైన విద్యార్థిని పేరు లయస్మిత (20). ఆమెను తన తోటి విద్యార్థి, తన గ్రామానికే చెందిన పవన్ కుమార్ అనే యువకుడు ప్రెమించమంటూ వేధిస్తున్నాడు. వీరిద్దరూ ఒకే యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. 

వీరికి కోలారు పట్టణ సమీప గ్రామం. ఒకే ఊరు కావడంతో రెగ్యులర్ గా ఏదో ఒకటి మాట్లాడుకునేవారు. దీంతో పవన్ ఆమెను ప్రేమ పేరుతో వేధించడం మొదలుపెట్టాడు. కానీ, దీనికి ఆమె ఒప్పుకోలేదు. తన ప్రేమను ఒప్పుకోలదని పవన్, లయస్మిత మీద కోపం పెంచుకన్నాడు. సోమవారం నాడు కూడా పవన్ మరోసారి తన ప్రేమ గురించి లయస్మిత దగ్గర మాట్లాడాడు. దీంతో ఆమె అతడిని తిట్టింది. 

కోపంతో ఊగిపోయిన పవన్ కాలేజీలో అందరూ చూస్తుండగానే ఆమెను ఇష్టానుసారం కత్తితో పొడిచాడు. ఆ తరువాత తనను తాను పొడుకున్నాడు.. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే మిగతా వారు వీరిద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే లయస్మిత మరణించిందని డాక్టర్లు దృవీకరించారు. పవన్ కు తీవ్ర గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. 

click me!