పెళ్లి పేరుతో టోకరా.. రూ. 21 లక్షలు కాజేసిన దంపతులు...

By AN TeluguFirst Published Jan 2, 2021, 10:32 AM IST
Highlights

పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆల్రెడీ పెళ్లైన ఓ జంట ఓ వెబ్ సైట్ లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని ఏమార్చి రూ.21 లక్షలు దోచుకుంది. ఈ  దంపతులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

పెళ్లి పేరుతో ఓ యువకుడిని మోసం చేసి లక్షల రూపాయలు దోచుకున్న సంఘటన హైదరాబాద్ లో జరిగింది. ఆల్రెడీ పెళ్లైన ఓ జంట ఓ వెబ్ సైట్ లో నకిలీ ప్రొఫైల్ పెట్టి యువకుడిని ఏమార్చి రూ.21 లక్షలు దోచుకుంది. ఈ  దంపతులను రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఇన్ స్పెక్టర్ రాము కథనం ప్రకారం విజయవాడకు చెందిన కంపా హృదయానంద్ (30) 2017లో అనూష అలియాస్ హారిక (20)ను పెళ్లి చేసుకున్నాడు. హారికకు అంతకుముందే మరో వ్యక్తితో పెళ్ళై, విడాకులు కూడా తీసుకుంది. హృదయానంద్ తో పెళ్లి అయిన కొంతకాలానికి అతను అనారోగ్యం బారిన పడి ఏ పనీ చేయలేకపోయాడు. 

ఈ క్రమంలో హారిక హైదరాబాద్ లోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్ లో ఉద్యోగంలో చేరింది. చాలీ చాలని సంపాదనతో సంతృప్తి చెందక ఈ దంపతులు ఆన్ లైన్ మోసాలకు ప్లాన్ వేశారు. హారికా హృదయానంద్ పేరిట ఓ ఫేక్ ఫ్రొఫైల్ తయారు చేసి గుర్తు తెలియని అందమైన యువతి ఫొటోతో ఇండియన్ డేటింగ్.కామ్ అనే వెబ్ సైట్ లో పోస్ట్ చేశారు. 

ఆమెతో నేరేడ్ మెట్ కు చెందిన డోనాల్డ్ హోరసీస్ రోజారియో అనే వ్యక్తి చాటింగ్ మొదలెట్టాడు. కొద్ది కాలం గడిచాక చివరకు గుండె జబ్బుతో బాధపడుతున్న తన తల్లి శస్త్రచికిత్సకు ఆర్థిక సాయం కావాలంటూ హారిక కోరింది. డొనాల్డ్ ఆన్ లైన్ లో డబ్బు పంపాడు. మరికొన్ని రోజుల తర్వాత తల్లి మరణించిందని, తన సోదరి సర్జరీ కోసమని ఇలా విడతల వారీగా డబ్బు అడిగింది. 

నిజమేనని నమ్మిన డోనాల్డ్ పలు దఫాలుగా రూ. 21 లక్షలు ఆమెకు ఆన్ లైన్ లో చెల్లించాడు. ఆ తర్వాత కూడా పెళ్లిని వాయిదా వేస్తూ రావడంతో అనుమానించి డోనాల్డ్ రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విజయవాడకు వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇద్దరినీ రిమాండుకు తరలించారు. పెళ్లి విషయంలో ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాచకొండ సైబర్ క్రైం ఏసీపీ హరినాథ్ నెటిజన్లకు సూచించారు. 

click me!