
వికారాబాద్ : వారిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. మంచి స్నేహితులు కూడా. ఉపాధినిమిత్తం హైదరాబాద్ కు వెళ్లిన ఇద్దరూ ఒకేదగ్గర పనిచేసేవారు. ఇలా ఎప్పుడూ కలిసేవుండే స్నేహితుల మధ్య ఓ మహిళ విషయంలో గొడవలు మొదలయ్యాయి. స్నేహితుడి భార్యపై కన్నేసిన నీచుడు దారుణానికి ఒడిగట్టాడు. ప్రాణ స్నేహితుడికి ఫుల్లుగా మద్యం తాగించి అతి దారుణంగా హతమార్చాడు. ఈ దారుణం వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలకేంద్రానికి చెందిన శేఖర్(32), గోపాల్ స్నేహితులు. పక్కపక్క ఇళ్ళలోనే వుండే వీరిద్దరూ ఉపాధినిమిత్తం హైదరాబాద్ లో వుంటున్నారు. శేఖర్ భార్యా పిల్లలతో కలిసి వుంటున్నారు. గోపాల్ మాత్రం ఒంటరిగానే నగరంలో వుండేవాడు.
శేఖర్, గోపాల్ ఒకేచోట కూలీపనులకు వెళ్లేవారు. దీంతో తరచూ శేఖర్ ఇంటికి వెళుతుండేవాడు గోపాల్. ఈ క్రమంలో తన భార్యపై మోజుపడ్డ గోపాల్ కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని శేఖర్ అనుమానించాడు. దీంతో స్నేహితుడిపై కోపంతో రగిలిపోయిన అతడు తగిన బుద్ది చెప్పాలని భావించాడు.
Read More కోరిక తీర్చాలంటూ యువతికి బ్లాక్ మెయిల్... ఫేస్ బుక్ స్నేహం ఎంతపని చేసిందో చూడండి..!
రెండ్రోజుల క్రితం శేఖర్ కుటుంబంతో కలిసి స్వగ్రామం దౌల్తాబాద్ వెళ్ళాడు. ఇదే సమయంలో గోపాల్ కూడా గ్రామానికి వెళ్ళాడు. దీంతో తన భార్యకోసమే గ్రామానికి వచ్చాడని భావించిన శేఖర్ అనుమానం మరింత పెరిగింది. ఈ విషయాన్ని ఇక తేల్చేయాలని భావించిన శేఖర్ పార్టీ చేసుకుందామని చెప్పి గోపాల్ ను ఓ దాబాకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ మద్యం సేవించి భోజనం చేసారు. అనంతరం తమవెంట మద్యం తీసుకెళ్లి పొలాల్లో కూర్చుని తాగారు. ఈ క్రమంలోనే ఇద్దరిమధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. మద్యంమత్తులో గోపాల్ బీరు సీసాతో కొట్టడంతో శేఖర్ కిందపడిపోయాడు. వెంటనే అతడిపై బండరాయి వేయడంతో తీవ్ర రక్తస్రావమై స్ఫృహతప్పి పడిపోయాడు.
గోపాల్ తో కలిసి బయలకు వెళ్లిన భర్త తిరిగిరాకపోవడంతో శేఖర్ భార్యను అనుమానం వచ్చింది. కుటుంబసభ్యులంతా గోపాల్ వద్దకు వెళ్లి గట్టిగా నిలదీయగా దాడివిషయం బయటపెట్టాడు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబసభ్యులు కొనఊపిరితో పడివున్న శేఖర్ ను హాస్పిటల్ కు తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించడంతో శేఖర్ మృతిచెందాడు. అతడి భార్య ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గోపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.