
అనారోగ్యంతో మరణించిన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అంత్యక్రియలు రేపు ఉదయం 11 గంటలకు నల్గొండలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ప్రస్తుతం కేర్ ఆసుపత్రి నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్ధం ఎంబీ భవన్కు తరలించారు. అనంతరం రేపు ఉదయం నల్గొండకు మల్లు స్వరాజ్యం భౌతికకాయాన్ని తరలించనున్నారు. స్వరాజ్యం మరణం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్.. సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, సీపీఐ నారాయణ సంతాపం తెలిపారు.
అంతకుముందు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లు స్వరాజ్యం హైదరాబాద్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. మల్లు స్వరాజ్యం (mallu swarajyam) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు స్వాతంత్య్రోద్యమ కాలం నాటి ‘స్వరాజ్’ అనే నినాదం పట్ల ప్రభావితులై ఆమెకు స్వరాజ్యం అనే పేరు పెట్టారు. Maxim Gorkys Mother చదివిన తర్వాత స్వరాజ్యం విప్లవం వైపు మళ్లారు. ఆమె జమీందారు కుటుంబంలో జన్మించిన.. 12 ఏళ్లకే పోరుబాట పట్టి ప్రజల మధ్య తిరిగారు. వెట్టిచాకిరీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ పిలుపు మేరకు ఉద్యమాలు చేసింది. వెట్టిచాకిరీ బాధితులకు బియ్యాన్ని పంపిణీ చేసింది. ఇందులో తన కుటుంబానికి చెందిన భూముల్లోని ధాన్యం కూడా ఉంది.
16 ఏళ్లకే భూమి, భుక్తి, విముక్తి కోసం బందూక్ చేతబట్టారు. తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకుగా పాల్గొన్నారు. భూస్వాములు, నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. తన భర్త మల్లు వెంకట నర్సింహా రెడ్డి, సోదరుడు భీమిరెడ్డి నర్సింహారెడ్డితో తెలంగాణ సాయుధ పోరాటంలో పాలుపంచుకున్నారు. ఆ పోరాటంలో మహిళా కమాండర్గా పనిచేసిన మల్లు స్వరాజ్యం తలపై నిజాం ప్రభుత్వం అప్పట్లోనే 10 వేల రూపాయల రివార్డు ప్రకటించింది. అయినప్పటికీ ఆమె వారికి చిక్కకుండా తన పోరును కొనసాగించింది. అయితే తనను ప్రజలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని మల్లు స్వరాజ్యం చెప్పేవారు.
కార్మికుల వేతనాల గురించి, రైతు సమస్యలపై మల్లు స్వరాజ్యం రాజీలేని పోరాటం చేశారు. కమ్యూనిస్టు సాయుధ పోరాట పరిధిని విస్తరించి జమీందారుల నుంచి భూమిని లాక్కొని పేదలకు పంపిణీ చేశారు. ఆ తర్వాత కమ్యూనిస్టు ముఖ్య నాయకురాలిగా మల్లు స్వరాజ్యం ఎదిగారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1981లో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘానికి ఉపాధ్యక్షురాలిగా మల్లు స్వరాజ్యం పనిచేశారు.