అగ్రరాజ్యాధినేతతో ఒకరోజు..గోల్డెన్ ఛాన్స్‌ మిస్ చేసుకున్న మహేశ్ భగవత్

By sivanagaprasad kodatiFirst Published Oct 10, 2018, 11:39 AM IST
Highlights

సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టిస్తూ శాంతిభద్రతలు కాపాడుతూ కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్‌ అరుదైన అవకాశాన్ని కోల్పోయారు. 

సంఘ విద్రోహ శక్తుల ఆటకట్టిస్తూ శాంతిభద్రతలు కాపాడుతూ కమిషనరేట్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్‌ అరుదైన అవకాశాన్ని కోల్పోయారు. అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను కలిసి, ఆయన చేతుల మీదుగా అవార్డ్ అందుకునే అవకాశాన్ని భగవత్ తృటిలో చేజార్చుకున్నారు. 

ప్రతి ఏటా అమెరికా ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన ఐఏసీపీ అవార్డుకు మనదేశం తరపున రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఎంపికయ్యారు. సోమవారం యూఎస్‌లోని ఓర్‌లాండోలో జరిగే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాల్సిందిగా అమెరికా ప్రభుత్వం ఆయనకు ఆహ్వానం పంపింది.

అయితే తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటం, పనుల ఒత్తిడి, కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉండటంతో సీపీ అమెరికా ప్రయణాన్ని రద్దు చేసుకున్నారు. సోమవారం జరిగిన కార్యక్రమంలో 100కు పైగా దేశాల నుంచి వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పురస్కారాలను అందజేశారు. మరోవైపు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి రాలేకపోయిన సీపీకి పోస్టులో అవార్డును పంపుతామని ఐఏసీపీ తెలిపింది.

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఇటుకల బట్టీల్లో పనిచేసే కార్మికుల పిల్లలకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కల్పించి.. వారి కోసం ప్రత్యేకంగా వర్కుసైట్ స్కూళ్లు ఏర్పాటు చేసి చిన్నారుల సంక్షేమం కోసం కృషి చేసినందుకు గాను మహేశ్ భగవత్‌ను అమెరికా ప్రభుత్వం ఈ అవార్డుకు ఎంపిక చేసింది. గతంలో మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు గాను అమెరికా ప్రభుత్వం నుంచి మహేశ్ భగవత్‌ ‘‘హీరో’’ అవార్డు అందుకున్నారు.
 

click me!