
తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న రైతు బంధు పథకాన్నే కేంద్ర ప్రభుత్వం అనుకరించిందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇలా కేసీఆర్ మానసపుత్రిక లాంటి పథకం దేశ వ్యాప్తంగా కూడా అమలవుతూ రైతులకు లబ్ధి చేకూర్చడం ఆనందంగా వుందని కేటీఆర్ పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఇవాళ దేశ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు వ్యవసాయ పెట్టుబడిని నగదు రూపంలో అందించనున్నట్లు ప్రకటించింది. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున సాయం అందించనున్నట్లు వెల్లడించింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు బంధు పథకం పేరును మాత్రమే కేంద్ర ప్రభుత్వం మార్చిందని...దాని స్పూర్తి మాత్రం అదేనని కేటీఆర్ అన్నారు. చివరగా జై కిసాన్ అంటూ కేటీఆన్ తన ట్వీట్ ముగించాడు.
కేటీఆర్ ట్వీట్ పై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసి కూడా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ పథకాన్ని అనుకరించడం ద్వారా కేసీఆర్ రాజకీయ చతురత, ముందుచూపు ఎంత గొప్పగా వుంటుందో మరోసారి నిర్ధారణ అయ్యిందన్నారు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పథకం కేసీఆర్ పథకాన్నే కాపీ పేస్ట్ చేశారని అన్నారు. వారికి సొంత ఆలోచనలే లేవని ఓవైసి మండిపడ్డారు.
కేసీఆర్ వంటి విజన్ వున్న నాయకుడు దేశాన్ని ముందుకు నడిపించడానికి, అభివృద్ది పర్చడానికి ఎంతో అవసరమని ఓవైసి వెల్లడించారు. అందుకోసమే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం వుందన్నారు. ఇలా కేటీఆర్ ట్వీట్ పై స్పందిస్తూ అసదుద్దిన్ కూడా ట్వీట్ చేశారు.