తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి విడత జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా కలత చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు సమాచారం.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) తొలి విడత జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా కలత చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆమె శనివారం ఉదయం టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేదా హరీష్ రావుతో సమావేశమైన తర్వాత తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖకు తొలి విడత జాబితాలో కేసిఆర్ టికెట్ ఖరారు చేయలేదు. తన కూతురు సుస్మితా పటేల్ కు పరకాల లేదా భూపాలపల్లి సీటు కేటాయించాలని కొండా సురేఖ కోరుతున్నారు.
అయితే, తన కూతురికి టికెట్ కేటాయించకపోగా, తనకే కేసిఆర్ ఎసరు పెట్టారనే ఆవేదనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. కొండా సురేఖతో స్థానిక నేతలకు తీవ్రమైన విభేదాలున్నాయి. పైగా, తూర్పు నియోజకవర్గం సీటును పలువురు టీఆర్ఎస్ నేతలు ఆశిస్తున్నారు.
ఈ పరిస్థితిలో తనకు కూడా టికెట్ వస్తుందో రాదో అనే డైలమాలో సురేఖ ఉన్నారు. దాంతో ఆమె పార్టీ మారాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె శనివారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ప్రెస్ మీట్ పెట్టి నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.