కాంగ్రెసు పార్టీ కమిటీల కూర్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా స్పందించారు.
హైదరాబాద్: తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెసు పార్టీపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీ కీలక భేటీకి గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెసు పార్టీ కమిటీల కూర్పుపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కాంగ్రెసు పార్టీకి అనుకూలంగా స్పందించారు.
కాంగ్రెసు నాయకత్వం వ్యవహార శైలి విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పరస్పరం విభేదిస్తున్నట్లు కనిపించారు. అయితే, శనివారం గాంధీభవన్ లో జరిగిన పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాలేదు.
కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ అధ్యక్షతన సమావేశం ఏర్పాటైంది. ఆ కమిటీకి కో చైర్మన్ గా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. కీలకమైన స్థానంలో ఉండి కూడా ఆయన సమావేశానికి రాకపోవడం ఆసక్తికరంగా మారింది.
అయితే, దానిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి వివరణ ఇచ్చారు. గణేశ్ నిమజ్జనం కారణంగా తాను సమావేశానికి హాజరు కాలేకపోతున్నట్లు ఆయన తెలిపారు. అయితే, ఇందులో ఏదైనా రాజకీయం ఉందా అనే ప్రశ్న తలెత్తుతోంది.