
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు. కాంట్రాక్ట్ల కోసం అమ్ముడుపోయానని ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డి.. వాటిని నిరూపిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని అన్నారు. నిరూపించకుంటే రేవంత్ రెడ్డి పీసీసీకి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటావా? అని ఓపెన్ చాలెంజ్ చేశారు. తాను రేవంత్ రెడ్డికి పీసీసీ ఇవ్వమని ఎక్కడైనా చెప్పినట్టుగా రుజువు చేస్తావా? అని ప్రశ్నించారు. ఎందుకు అబద్దాలు చెబుతున్నావు అంటూ రేవంత్పై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రేవంత్ రెడ్డి.. ఎంపీగా పాలమూరులో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నించారు. సీమాంధ్రుల ఓట్ల కోసం మల్కాజ్గిరి నుంచి పోటీ చేశాడని అన్నారు. నోటికొచ్చినట్టుగా మాట్లాడితే మునుగోడులో బట్టలు విప్పి కొడుతారని.. తన కోసం ప్రాణం ఇచ్చే ప్రజలు ఉన్నారని చెప్పారు. పీసీసీ అయ్యాక రేవంత్ రెడ్డి ఇంటికి వస్తానని అడిగితే వద్దంటే వద్దని చెప్పానని అన్నారు. జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తి ఇంటికి వస్తే మలినం అవుతుందనే వద్దని అన్న తెలిపారు. బయట ఒక ముప్పావు గంట మాట్లాడానని చెప్పారు. ‘‘నువ్వు ఎంత ఉన్నావని.. నన్ను తొక్కుతువా?’’ అంటూ రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇప్పటికీ.. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఎల్లో మీడియా, సీమాంధ్ర పెట్టుబడిదారులు రేవంత్ రెడ్డిని ముందు పెట్టి నడిపిస్తున్నారని.. హైదరాబాద్పై పట్టు సాధించేందుకు చూస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ నష్టపోయిందని.. రేవంత్ నాయకత్వంలో ముందుకు వెళితే తెలంగాణలో కాంగ్రెస్ చచ్చిపోతుందని అన్నారు.
మునుగోడు ప్రజలు చారిత్రత్మక తీర్పును ఇస్తారనే ధైర్యంతో తాను రాజీనామా చేస్తున్నట్టుగా చెప్పారు. రేవంత్ వద్ద పనిచేయాలా? వద్దా? అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గుండె మీద చేయి వేసుకోని ఆలోచించుకోవాలని కోరారు. పార్టీలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఆదుకోవాలంటే.. కేంద్రంలో ఉన్న సర్కారే ఇక్కడ కూడా అధికారంలోకి రావాలని అన్నారు. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ మారితే.. అప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి భూస్థాపితం చేస్తాడని.. కార్యకర్తలు మోసపోవద్దని రాజగోపాల్ రెడ్డి అన్నారు. బతికి ఉన్నంతా వరకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విమర్శించనని చెప్పారు. అవినీతి పాలనను అంతమొందించాలనే లక్ష్యంతోనే ఇప్పుడు పార్టీ మారుతున్నానని చెప్పారు. గతంలో తనకు మంత్రి పదవి ఇస్తానని చెప్పిన టీఆర్ఎస్లోకి వెళ్లలేదని తెలిపారు.