తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించిన నేపథ్యంలో కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను కాంగ్రెసుకు భవిష్యత్తు లేదని మాట్లాడిన విషయం వాస్తవమేనని అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ పిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన నేపథ్యంలో కాంగ్రెసు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెసుకు భవిష్యత్తు లేదని తాను గతంలో మాట్లాడిన విషయం వాస్తవమేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రెండేళ్లుగా తాను కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించిందని ఆయన అన్నారు. తాను పార్టీపై విమర్శలు చేయబోనని, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడబోనని ఆయన చెప్పారు.
సరైన నాయకత్వం లేకపోవడం వల్లనే కాంగ్రెసు పార్టీ ఓడిపోతూ వచ్చిందని ఆయన అన్నారు. తాను కాంగ్రెసు పార్టీలోనే కొనసాగుతానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. అధిష్టానం తప్పుడు నిర్ణయాల వల్ల రెండుసార్లు అధికారంలోకి రాలేకపోయిందని ఆయన అన్నారు. బిజెపియే ప్రత్యామ్నాయం కాబోతోందని తాను చెప్పిన మాట నిజమేనని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి పీసీసీ రేసులో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ మీద తనకు అభిమానం ఉందని ఆయన చెప్పారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తెలంగాణ పీసీసీ పదవిని ఆశించారు. దానికితోడు, ఆయన బిజెపిలో చేరుతారంటూ గతంలో ప్రచారం జరిగింది.