
అమరావతి: టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని తాను రెండు నెలల క్రితమే చెప్పినట్లు హస్తసాముద్రిక నిపుణులు, జ్యోతిష్యుడు మాండ్రు నారాయణరావు స్పష్టం చేశారు. ఏపీ సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కేసీఆర్ పరిస్థితి చాలా బాగుందని అయితే దైవిక క్రియలు చేస్తే భవిష్యత్ లో ఆయన సునాయాసంగా ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
2019లో కేసీఆర్ పట్టిందల్లా బంగారం అవుతుందని తెలిపారు. అలాగే ఏపీ మంత్రి నారా లోకేష్ జాతకం కంటే కేటీఆర్ జాతకం చాలా బాగుందన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని 2 నెలల కిందటే తాను చెప్పినట్లు తెలిపారు.
తెలంగాణ శాసన సభను రద్దు చేసిన తర్వాత కేసీఆర్ జాతకంపై మాండ్రు నారాయణ రమణారావు స్పందించారు. సెప్టెంబర్ 8న మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ మళ్లీ సీఎం పీఠం అధిరోహిస్తారని అలాగే భవిష్యత్ లో పీఎం అవుతారంటూ కూడా వ్యాఖ్యానించారు.
మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాల పరిస్థితి కూడా బాగోలేదని చెప్పారు. పార్లమెంట్ భవనంలో, మోదీ పేషీలో నెగిటివ్ వేవ్స్ చూపిస్తున్నట్లు తెలిపారు. నూతన పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేస్తే మళ్లీ మోదీ ప్రధాని అవుతారన్నారు. రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే యోగం ఉంది కానీ 2019లో లేదన్నారు.