తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి శ్రీనివాస్ కు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. సాయంత్రం ఆరు తర్వాత కేసీఆర్తో అపాయింట్మెంట్ ఉంటుందని ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు తొలుత చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారంటూ ఆ తర్వాత చెప్పారు.
ఈ విషయంపై డిఎస్ స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కలుస్తానని అన్నారని, అందుకే ఢిల్లీ నుంచి వచ్చానని ఆయన చెప్పారు. రేపు పిలుస్తామని సీఎంవో నుంచి ఫోన్ వచ్చిందని, విజయవాడ నుంచి మూడు గంటలకు వస్తారట. పిలవదల్చుకుంటే పిలుస్తారని ఆయన అన్నారు.
తనకు ఏ విధమైన సమస్య లేదని, తాను పాపం చేసుంటే సమస్య ఉంటుందని ఆయన అన్నారు. జరిగిన దానిపై ఇంతకుముందే స్పష్టత ఇచ్చానని అన్నారు. తాను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అపాయింట్ మెంట్ అడగలేదని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తనను కలవాలని సిఎం చెప్పారని, అయితే ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉన్నానని ఆయన చెప్పారు.
కేసిఆర్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి కలుస్తానని, ముఖ్యమంత్రి కార్యాలయానికి అదే విషయం చెప్పానని ఆయన అన్నారు. సిఎం బిజీగా ఉండడంతో కలవడం కుదరలేదని, మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదని అన్నారు. ఎప్పుడు పిలుస్తారో తనకు తెలియదని, తనకేమీ సమస్య లేదని ఆయన చెప్పారు.