డిసెంబర్ 6వ తేదీన కలవలేను.. : సీబీఐకి కల్వకుంట్ల కవిత లేఖ..

By Sumanth KanukulaFirst Published Dec 5, 2022, 10:06 AM IST
Highlights

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి మరోసారి లేఖ రాశారు. డిసెంబర్ 6వ తేదీన సీబీఐ అధికారులను కలవలేనని తెలిపారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌(సీబీఐ)కి మరోసారి లేఖ రాశారు. డిసెంబర్ 6వ తేదీన సీబీఐ అధికారులను కలవలేనని తెలిపారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేకపోతున్నట్టుగా చెప్పారు. ఈ నెల 11, 12, 14, 15 తేదీల్లో విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఆ తేదీల్లో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే అందుబాటులోనే ఉంటానని స్పష్టం చేశారు. అందులో ఏ తేదీ అనుకూలమో త్వరగా తెలియజేయాలని కోరారు. సీబీఐ వెబ్‌సైట్‌లో ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను క్షుణంగా పరిశీలించానని చెప్పారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని పేర్కొన్నారు. అయితే తాను చట్టాన్ని గౌరవిస్తానని.. దర్యాప్తుకు సహకరిస్తానని చెప్పారు.


‘‘ఎఫ్‌ఐఆర్ కాపీ, ఫిర్యాదు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని తెలుపుతూ మీరు పంపిన ఈ-మెయిల్‌ను నేను స్వీకరించాను. నేను ఎఫ్‌ఐఆర్‌లోని విషయాలు, నిందితుల జాబితాతో పాటు 22.07.2022 నాటి ఫిర్యాదులోని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాను. అందులో నా పేరు ఏ విధంగానూ గుర్తించబడలేదని నేను గుర్తుచేయాలని అనుకుంటున్నాను. మీరు ప్రతిపాదించినట్లుగా.. నేను డిసెంబర్ 6వ తేదీన కలుసుకునే స్థితిలో లేను. నా ముందస్తు షెడ్యూల్ కారణంగా.. ఈ నెల 11, 12 లేదా 14, 15 తేదీల్లో మీకు ఏది అనుకూలమో ఆ సమయంలో హైదరాబాద్‌లోని నా నివాసంలో నేను మిమ్మల్ని కలవగలుగుతాను. దయచేసి వీలైనంత త్వరగా తేదీని నిర్దారించవచ్చు. నేను చట్టాన్ని గౌరవించే పౌరురాలును. తప్పకుండా విచారణకు సహకరిస్తాను. విచారణకు సహకరించేందుకు పైన పేర్కొన్న తేదీలలో ఏ రోజైనా నేను మిమ్మల్ని కలుస్తాను. ఇది చట్టం ప్రకారం అందుబాటులో ఉన్న నా చట్టపరమైన హక్కులకు ఎటువంటి భంగం కలిగించదని స్పష్టం చేయబడింది’’ అని కవిత సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.

 ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి సీబీఐ అధికారులు ఇటీవల కవితకు నోటీసులు  జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఆమె సౌకర్యార్థం హైదరాబాద్‌లోని నివాసంలో గానీ, ఢిల్లీలోని నివాసంలో గానీ ఈ నెల 6వ తేదీన ఉదయం 11 గంటలకు విచారించాలని అనకుంటున్నామని చెప్పారు. విచారణ ప్రదేశాన్ని తెలియజేయాని కోరారు. అయితే దీనిపై స్పందించిన హైదరాబాద్‌లోని నివాసంలో విచారణ అధికారులకు సమాధానమిస్తానని చెప్పారు. అయితే  శనివారం ప్రగతిభవన్‌లో కేసీఆర్‌తో సమావేశం అనంతరం సీబీఐకి కవిత లేఖ రాశారు. 

ఢిల్లీ  లిక్కర్ స్కామ్‌పై వచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్ ప్రతులను ఇవ్వాలని లేఖలో సీబీఐని కవిత కోరారు. డాక్యుమెంట్లు ఇస్తే వేగంగా సమాధానాలు ఇచ్చేందుకు వీలవుతుందని  తెలిపారు. తనకు పత్రాలు అందిన తర్వాత హైదరాబాద్‌లో సమావేశ తేదీని ఖరారు చేయవచ్చని పేర్కొన్నారు. కవిత లేఖపై స్పందించిన సీబీఐ అధికారులు.. సీబీఐ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు అందుబాటులో ఉన్నాయని ఈ-మెయిల్ ద్వారా కవితకు తెలియజేశారు. ఈ క్రమంలోనే వాటిని పరిశీలించిన కవిత.. తాజాగా మరోమారు కవిత సీబీఐకి లేఖ రాశారు. 

click me!