
Kalvakuntla Kavitha : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే భారత రాష్ట్ర సమితికి దూరమైన ఎమ్మెల్సీ కవిత సొంతంగా తెలంగాణ జాగృతి ద్వారా రాజకీయాలు చేస్తున్నారు. అయితే తన తండ్రి కేసీఆర్ ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో కవిత కాస్త రూటు మార్చారు. కొంతకాలంగా తండ్రికి కూడా దూరంగా ఉంటున్న కవిత ఇవాళ(గురువారం) విచారణకు హాజరుకానున్న కేసీఆర్ ను కలిసారు.
ఉదయమే హైదరాబాద్ నుండి తండ్రి నివాసముండే ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకున్నారు కవిత. భర్త అనిల్ కుమార్ తో కలిసి తండ్రివద్దకు వెళ్లారు. చాలాసేపు తండ్రితో ముచ్చటించారు.. అయితే వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణపైనే వీరిద్దరూ మాట్లాడుకున్నట్లు... రాజకీయాల ప్రస్తావన రాలేదని తెలుస్తోంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విచారణకు పిలవడంపై బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో తండ్రికి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ నోటీసులు జారీచేయడంపై కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి ఆందోళన చేపట్టింది. తద్వారా తాను కేవలం బిఆర్ఎస్ పార్టీకి, సోదరుడు కేటీఆర్ కు దూరమైనట్లు.. తండ్రి కేసీఆర్ కు ఎప్పటికీ దగ్గరేనని స్పష్టం చేసారు కవిత. ఇదే విషయాన్ని తాజాగా తండ్రిని కలవడం ద్వారా మరోసారి బైటపెట్టారు కవిత.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఉదయం 11 గంటలకే కేసీఆర్ హాజరుకావాల్సి ఉంది... కాబట్టి కవితతో ఎక్కువసేపు ఆయన మాట్లాడలేకపోయారట. కూతురు, అల్లుడితో కొద్దిసేపు ముచ్చటించిన ఆయన తర్వాత న్యాయ నిపుణులు, పార్టీ నాయకులతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తాజా రాజకీయ పరిణామాలు, తాను బిఆర్ఎస్ కు ఎందుకు దూరంగా ఉంటున్నారో కవిత వివరించే ప్రయత్నంచేసినా కుదరనట్లుగా తెలుస్తోంది. తాను రాసిన లేఖ ఎలా లీక్ అయ్యిందో అడిగే ప్రయత్నం కూడా చేసారట. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో ఏ ప్రశ్నలు అడుగుతారు? వాటికి ఏ సమాధానం చెప్పాలి? అనేదానిపైనే కేసీఆర్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే కవిత ఈ విషయాలను తండ్రివద్ద ప్రస్తావించలేకపోయిందట.
కొద్దిసేపు తండ్రితో ముచ్చటించిన కవిత ఆయన బిజీగా ఉండటంతో రాజకీయాల గురించి ఏం మాట్లాడలేకపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదామని భావించిన కవిత తండ్రి హైదరాబాద్ బయలుదేరాక భర్తతో కలిసి వెళ్లిపోయారు. అయితే తండ్రి కేసీఆర్ కు మద్దతుగా విచారణ జరిగే బిఆర్కే భవన్ కు కవిత వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కానీ ఆమెను కమీషన్ కార్యాలయంలోకి అనుమతించే అవకాశాలు లేవు… కొందరికి మాత్రమే కేసీఆర్ వెంట వెళ్లేందుకు అనుమతించారు.
మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ జస్టిస్ పిసి ఘోష్ కమీషన్ ముందుకు హాజరుకానున్నారు. ఇప్పటికే ఆయన ఎర్రవల్లి ఫాంహౌస్ నుండి హైదరాబాద్ కు బయలుదేరారు... ఆయనవెంట మాజీ మంత్రులు హరీష్రావు, ప్రశాంత్రెడ్డి ఉన్నారు. ఉదయం 11.30 గంటలకు కేసీఆర్ బిఆర్కే భవన్ కు చేరుకోనున్నారు.
కేసీఆర్ రాక నేపథ్యంలో బిఆర్కే భవన్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేసారు. బిఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో బీఆర్కే భవన్ రోడ్డును మూసివేసారు పోలీసులు.. అనుమతి ఉన్నవారికి మినహా ఇతరులెవ్వరినీ అనుమతించడంలేదు.