
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. అయితే కొంతకాలంగా తెలంగాణపై ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ప్రత్యేక ఫోకస్ చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలతో ప్రియాంక గాంధీ పలు సందర్బాల్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. అంతేకాకుండా పార్టీలో అంతర్గత పోరుపై కూడా ప్రియాంక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రియాంక తెలంగాణ పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపింది. అయితే ప్రియాంక గాంధీ పర్యటన నేపథ్యంలో టీ కాంగ్రెస్లో సరికొత్త చర్చ మొదలైంది. తెలంగాణ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ చర్చ తెరమీదకు రావడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణలో రెండు సార్లు వరుసగా అధికారం చేపట్టిన బీఆర్ఎస్.. మరోసారి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయాలని భారీ ప్రణాళికలతో సిద్దమవుతుంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్.. ఇక్కడ అధికారం కోసం తీవ్రంగానే శ్రమిస్తుంది. ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ బాధ్యతలను ప్రియాంక ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్టుగా చెబుతున్నారు. గత కొద్దిరోజులుగా ప్రియాంక గాంధీ కర్ణాటకలో విస్తృతంగా పర్యటించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తదుపరి లక్ష్యం తెలంగాణ అని ఆ పార్టీ సీనియర్ జైరాం రమేష్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ నేతలను ఏకం చేసే బాధ్యతను ప్రియాంక గాంధీ తీసుకుంటారని అన్నారు. జైరాం రమేష్ వ్యాఖ్యలను గమనిస్తే.. టీ కాంగ్రెస్ పూర్తి బాధ్యతలను కాంగ్రెష్ హైకమాండ్ ప్రియాంక గాంధీకే అప్పగించినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రియాంక పర్యటన జస్ట్ ఆరంభం మాత్రమేనని.. రానున్న రోజుల్లో ఆమె తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయిస్తారని చెబుతున్నారు.
ఈ క్రమంలోనే టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు తరుచుగా ప్రియాంక గాంధీతో ఢిల్లీలో సమావేశవుతున్నారు. ఆమె సూచనల మేరకు పలు కార్యక్రమాలను టేకాఫ్ చేస్తున్నారు. అయితే తెలంగాణలో పార్టీకి మరింత జోష్ తీసుకురావాలంటే.. ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలనే ప్రతిపాదనను టీ కాంగ్రెస్ ముఖ్య నేతలు కొందరు కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్టుగా తెలుస్తోంది. అయితే దీని వెనక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలకంగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. తెలంగాణలో కూడా పార్టీకి సానుకూల పవనాలు వీచే అవకాశం ఉందని కూడా ఆయన భావిస్తున్నారు.
ప్రియాంక తెలంగాణ నుంచి ఎంపీగా గానీ, ఎమ్మెల్యేగా గానీ పోటీ చేసినట్టయితే.. పార్టీకి మరింత జోష్ వస్తుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతుంది. ఒకవేళ ప్రియాంక గాంధీని తెలగాణ నుంచి బరిలో నిలిపితే.. మహబూబ్నగర్ లేదా మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేయిస్తారని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతుంది.
అయితే ఈ క్రమంలోనే గతంలో ప్రియాంక గాంధీ నాన్నమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గతంలో తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ అధికారానికి దూరమయ్యారు. ఆ తర్వాత 1980లో జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ కాంగ్రెస్(ఐ) నుంచి మెదక్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ రోజుల్లోనే రెండు లక్షలకు పైగా మెజారిటీతో ఘన విజయం సాధించారు. కేంద్రంలో కూడా ఇందిరా అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు నానమ్మ బాటలోనే ప్రియాంక కూడా తెలంగాణ బాట పడతారా? అనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. ఇదిలా ఉంటే.. బీజేపీ అగ్రనాయకులై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలలో ఎవరో ఒకరు 2024 లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం సాగినప్పటికీ.. అందులో ఎలాంటి వాస్తవం కేంద్ర బీజేపీ వర్గాలు తెలిపాయి.